Begin typing your search above and press return to search.

వాషింగ్టన్ డీసీలో ఏపీ విద్యార్థులు... ఐఎంఎఫ్ అధికారుల ప్రశంసలు!

ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులను ఉద్దేశించి ఐఎంఎఫ్ అధికారులు మాట్లాడారు!

By:  Tupaki Desk   |   27 Sep 2023 8:39 AM GMT
వాషింగ్టన్  డీసీలో ఏపీ విద్యార్థులు... ఐఎంఎఫ్  అధికారుల ప్రశంసలు!
X

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ప్రతినిధి బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కార్యలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా... ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌ తో సహా భారతదేశ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సుబ్రమణియన్ తో విద్యార్థలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులను ఉద్దేశించి ఐఎంఎఫ్ అధికారులు మాట్లాడారు!

అవును.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఉద్దేశించి ఐఎంఎఫ్ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా మానవ వనరులపై పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కూడా ఈ విధానాలను అనుకరించాలని ఈ మేరకు ఐఎంఎఫ్ అధికారులు సూచించారు.

ఇదే క్రమంలో... విద్యార్థులు ఆత్మస్థైర్యం, ధృడసంకల్పంతో చదువుకుని భారతదేశంకోసం అత్యధికమైన ఉత్సాహంతో పనిచేసి దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని భారతదేశ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్ధులు జీవితంలో ఎలా విజయం సాధించాలనే దానిపై మార్గదర్శకత్వం, చిట్కాలను స్వీకరించటం గొప్ప విషయమని అన్నారు.

ఇదే సమయంలో విద్యార్ధులకు తన వ్యక్తిగత విజయగాథనే ఉదాహరణగా చెప్పిన సుబ్రమణియన్... తన చదువే తనని ఐఎంఎఫ్ లో ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టిందని, యువతకు నిజమైన ప్రేరణగా పనిచేసిందని తెలిపారు. అనంతరం... "మీ మీ కలలను అనుసరిస్తూ మీరు ఎంచుకున్న మార్గంలోనే మందుకు సాగి ఎత్తైన శిఖరాలు చేరుకోవాలి" అంటూ ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌ ఆకాంక్షించారు.

అదేవిధంగా.. నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన గీతా గోపీనాథ్‌, ఐఎంఎఫ్ లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఎదిగేవరకు చేసిన తన కృషిని, తన విశేషమైన ప్రయాణాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అందుకోగలరనే నమ్మకాన్ని విద్యార్థుల్లో నింపడానికి ఆమె మాటలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో కె. సుబ్రమణియన్, గీతా గోపీనాథ్ వంటి నిష్ణాతులైన వ్యక్తులతో విద్యార్ధుల సమావేశం నిస్సందేహంగా వారికొక ప్రేరణగా నిలుస్తాయని చెప్పడం అతిశయోక్తి కాదనే చెప్పాలి. దీంతో మన విద్యార్ధుల్లో స్థైర్యాన్ని నింపిన కె సుబ్రమణియన్, గీతా గోపీనాథ్ వంటి అధికారుల కృషికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇదే సమయంలో... వారి మార్గదర్శకత్వం, ప్రేరణ విద్యార్థుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని.. శ్రేష్ఠత కోసం కృషి చేయడానికి, సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి వారిని శక్తివంతం చేస్తుందని కొనియాడింది.

దీంతో... విద్యార్ధులకు అద్భుతమైన ప్రపంచ వేదికను అందించే లక్ష్యంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటన, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పనితీరుపై అంతరదృష్టిని పొందేందుకు, నిష్ణాతులైన వ్యక్తుల నుండి నేర్చుకోవడానికి విద్యార్దులకు ఒక అద్భుతమైన అవకాశంగా పరిగణించవచ్చని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.