Begin typing your search above and press return to search.

చైనా-ఇండియా నుంచి 5 విమానాల్లో ఐఫోన్లను తరలించిన యాపిల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి యాపిల్ కంపెనీ చురుగ్గా స్పందించింది.

By:  Tupaki Desk   |   7 April 2025 7:41 AM
Apple Rushes iPhone Shipments to U.S. from India
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి యాపిల్ కంపెనీ చురుగ్గా స్పందించింది. భారత్, చైనాలలో తయారైన తమ ఐఫోన్లను హడావుడిగా అమెరికాకు తరలించింది. మార్చి నెల చివరి వారంలో కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 5 విమానాల నిండా ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇందులో భారత్ నుంచి మూడు విమానాలు, చైనా నుంచి రెండు విమానాలు ఉన్నాయని సమాచారం.

ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తాయన్న నేపథ్యంలో, మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా పన్నుల భారం తగ్గించుకోవడానికి భారత్, చైనాల్లోని తమ ఫ్యాక్టరీల్లో తయారైన ఐఫోన్లను వీలైనంత త్వరగా అమెరికాకు చేరవేసింది. ఈ చర్యతో యాపిల్ కంపెనీ కొంతకాలం పాటు ఐఫోన్ల ధరలను స్థిరంగా ఉంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్ లు అమల్లోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి ఐఫోన్ల ధరలు పెంచే ఆలోచన లేదని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది.

భారత్‌పై అమెరికా టారిఫ్‌లు విధించకముందే యాపిల్ ముందస్తు చర్యలు తీసుకుంది. భారత్ నుంచి కేవలం 3 రోజుల్లోనే 5 కార్గో విమానాల్లో ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను అమెరికాకు తరలించినట్లు తెలుస్తోంది. భారత్ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నందున, ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఒకవేళ భారత్‌లో తయారైన ఉత్పత్తులను అమెరికాకు తీసుకెళ్లినప్పుడు అదనపు సుంకాలు విధిస్తే, ఆ మేరకు ధరలు పెంచాల్సి వస్తుంది. అయితే, సుంకాలు అమల్లోకి రాకముందే ఉత్పత్తులను తరలించడం ద్వారా కొంతకాలం ధరలు పెంచకుండా విక్రయించవచ్చని యాపిల్ భావిస్తోంది.

ఇదిలా ఉండగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యాపిల్ మన దేశంలో ఐఫోన్లు, ఇతర పరికరాల తయారీ/అసెంబ్లింగ్‌ను చేస్తోంది. గతంలో భారత్ నుంచి అమెరికాకు చేసే ఫోన్ల ఎగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. అయితే, ఈ నెల 5 నుంచి 10% సుంకం అమల్లోకి రాగా ఈ నెల 9 నుంచి ఇది ఏకంగా 26%కి పెరగనుంది. దీంతో రానున్న రోజుల్లో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

యాపిల్ మాత్రమే కాకుండా రత్నాభరణాల రంగం కూడా ఇదే తరహాలో ముందస్తు ఎగుమతులు భారీగా పెంచింది. ముంబయి నుంచి ఈ నెల 1-4 తేదీల్లో అమెరికాకు రత్నాభరణాల ఎగుమతులు ఆరింతలు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో 61 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరగగా, ఈ ఏడాది అవి 344 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఈ పరిణామాలపై ఐసియా చీఫ్ పంకజ్ మొహింద్రో స్పందిస్తూ భారత్‌తో వాణిజ్య లోటును దృష్టిలో ఉంచుకునే అమెరికా తాజా సుంకాలు ప్రకటించిందని భావిస్తున్నామని అన్నారు. అమెరికా ఉత్పత్తులపై మన ప్రభుత్వం వెంటనే ప్రతీకార సుంకం విధించకుండా, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సౌదీ అరేబియా - యూఏఈలపై కేవలం 10% సుంకమే విధించినందున, ఎలక్ట్రానిక్స్ తయారీలో మనకు పోటీగా ఎదిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తానికి ట్రంప్ టారిఫ్ ల భయంతో యాపిల్ తీసుకున్న ఈ చర్య, రానున్న రోజుల్లో ఐఫోన్ల ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.