Begin typing your search above and press return to search.

'మీ మ‌న‌వ‌ళ్ల‌ను తెలుగు మీడియంలో వేయండి'

By:  Tupaki Desk   |   4 March 2024 4:40 AM GMT
మీ మ‌న‌వ‌ళ్ల‌ను తెలుగు మీడియంలో వేయండి
X

ఏపీలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటున్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు తమ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివించార‌ని, ఇప్పుడు మీ మ‌న‌వ‌ళ్ల‌ను తెలుగు మీడియంలో వేయాల‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ``వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు కానీ పేద పిల్లలు చదవకూడదా?`` అని నిలదీశారు. కదిరి నియోజకవర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చార‌ని తెలిపారు. ప్రతి ఇంటిలో ఏదో ఒక రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సహాయం అందింద‌న్నారు.

చంద్రబాబు 2014 లో వంద పేజీల మానిఫెస్టో లో 600 హామీలు ఇచ్చారు. ఎన్నికలు పూర్తవగానే ఆ మానిఫెస్టో ను వెబ్ సైట్ నుండి తొలగించారని పెద్దిరెడ్డి అన్నారు. ``14 వేల కోట్లు ఉన్న డ్వాక్రా అప్పులు నాడు తీర్చలేదు... నేడు వడ్డీతో కలిపి దాదాపు 24 వేల కోట్లు వైఎస్ జగన్ చెల్లించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? రైతులను, మహిళలను, యువతను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగనే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు`` అని అన్నారు.

కాగా, చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదని, ఆయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా? అని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం రాగానే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మనకు రెట్టింపు బడ్జెట్ కావాలని అన్నారు. ``చంద్రబాబు ఇచ్చే హామీలు అన్ని బూటకపు హామీలు. చంద్రబాబు హామీలు నెరవేరుస్తారా లేదా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి. విద్య వైద్యాన్ని ఎన్నడూ లేని విధంగా సీఎం జ‌గ‌న్‌ తీర్చిదిద్దారు`` అని అన్నారు.

చంద్రబాబు ప్రతి మహిళకు కేజీ బంగారం ఇస్తాను, ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తాను అని అంటారని, ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితిలో లేరని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ``మీకు మంచి జరిగుంటేనే ఓటు వేయండి`` అని చెప్పే దైర్యం సిఎం జగన్ కు మాత్ర‌మే ఉంద‌న్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి, మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి వ్యాఖ్యానించారు.