Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ సదస్సు కోసం ఆంధ్రా ప్రభుత్వ విద్యార్ధులకు అమెరికా పిలుపు

ఇదిలా ఉంటే 2024 మార్చి 5న అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఆహ్వానం లభించింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 2:43 PM GMT
అంతర్జాతీయ సదస్సు కోసం  ఆంధ్రా ప్రభుత్వ విద్యార్ధులకు అమెరికా పిలుపు
X

మన విద్యార్ధులు గొప్పోళ్ళోయ్ అని ఇపుడు అనుకునే పరిస్థితి ఉంది. సర్కార్ బడులలో చదివితే ఉన్న చోటనే ఉండిపోతారు అన్నది పాత మాట. ఇపుడు అంతర్జాతీయంగా మన వాళ్ళు సత్తా చాటుతున్నారు. విదేశాలకు అతిధులుగా మారుతున్నారు. ప్రఖ్యాత సంస్థల నుంచి ఆహ్వానం అందుకుంటున్నారు.


పక్క ఊరుకు వెళ్లాలంటేనే ఆలోచించే పేద విద్యార్ధులకు అమెరికా ఆహ్వానాలు నిజంగా ఆశ్చరకరమే. ఇదంతా ఆంధ్రాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల మార్పు వల్లనే సంభవించింది. అందరి చూపూ ఏపీ మీద పడింది. అందుకే మళ్లీ మళ్లీ మా దేశాలకు రండి అని చాలా సాదర పూర్వకంగా ఆహ్వానం లభిస్తోంది


ఇదిలా ఉంటే 2024 మార్చి 5న అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఆహ్వానం లభించింది. ఇప్పటికే ఒక పర్యాయం ఏపీ స్కూల్ విద్యార్హ్దులు ఐక్య రాజ్యసమితి దాకా వెళ్లి అక్కడ తమ ఆంగ్ల భాషా ప్రావీణ్యం చూపారు. దాంతో ఇపుడు వరసబెట్టి ఇన్విటేషన్లు వచ్చి పడుతున్నాయి. అలాగే ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించి ఎందరో మేధావులను ఆకట్టుకున్న ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దేశ విదేశాల విద్యావేత్తల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి.


ఈ నేపధ్యంలో ఇప్పుడు వారికే మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది. 2024 మార్చి 5న అమెరికాలో జరగనున్న నానో టెక్నాలజీ సదస్సుకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఘనమైన ఆహ్వానం అందింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సలహాదారు భారత సంతతికి చెందిన ఆర్తి ప్రభాకర్‌తో ఏపీ విద్యార్థులు ఆ వేదికలో మాట్లాడే గొప్ప సువర్ణ అవకాశం వారికి దక్కింది. ఆప్టిక్స్, విద్య, వైద్యం, ఉత్పత్తి, తయారీ రంగం,మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలమీద విద్యార్థులు అక్కడ ప్రసంగిస్తారు.

గత సెప్టెంబర్ లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొని ఆయాదేశాల ప్రతినిధులతో కలసి అక్కడి పాలనా విధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాలమీద చర్చలలో పాల్గొన్నారు.

అంతే కాదు అంతర్జాతీయ విద్యావేత్తలు, ఆర్థిక, సామాజిక వేత్తలతో భేటీలు సైతం నిర్వహించారు. అలా ఏపీ నుంచి వెళ్ళిన పదిమంది విద్యార్థులు పదిహేను రోజులపాటు కొలంబియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అలాగే ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు.

అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి కూడా చాలా చక్కగా అంతర్జాతీయ విద్యావేత్తలకు వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి నాడు- నేడు, విద్యా కానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందీ అన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు అక్కడి ప్రతినిధులకు వివరించారు.

అదే విధంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం విద్య కోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల నుంచి ప్రశంసలను కూడా పొందారు. తాజాగా ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు పిలుపు రావడం అంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలకు మరో గుర్తింపు వచ్చినట్లే అని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో విద్య వ్యవస్థలో మొదలైన సంస్కరణలు అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు అన్నది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో చోటుచేసుకున్న మార్పులను విదేశాల్లో వివరించి అంతర్జాతీయ మేధావుల దృష్టిని ఆకర్షించడం అన్నది మాత్రం నిజంగా గొప్ప విషయం.

పేద విద్యార్ధులు పాఠశాలలకు సైతం హాజరు కాలేని వారు ఈ రోజు విమానాలెక్కి అమెరికా పయనం కట్టడం అక్కడ పెద్ద వాళ్ళతో మేధావులతో కలసి డిబేట్స్ లో పాలుపంచుకోవడం అంటే ఏపీ విద్యారంగం సాధించిన ఘనతకు ఇంతకంటే ఉదాహరణ వేరొకటి కావాలా అని అంటున్నారు.