మిథున్ రెడ్డిని ఇరికించేసిన సాయిరెడ్డి? రూ.100 కోట్ల అప్పు తెచ్చిన ముప్పు!
ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇరికించేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 19 April 2025 6:08 AMఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇరికించేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్రపై తనకు ఎలాంటి సమాచారం లేదంటూనే అరబిందో ఫార్మా నుంచి రూ.100 కోట్లు అప్పు ఇప్పించానని చెప్పడం గమనార్హం. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ఆధాన్, డి-కాక్ కంపెనీలకు 12 శాతం వడ్డీతో అప్పు ఇప్పించానని చెప్పడంతో లిక్కర్ వ్యాపారంలో మిథున్ రెడ్డి ఉన్నట్లు పరోక్షంగా చెప్పినట్లైందని అంటున్నారు.
లిక్కర్ స్కాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరైన విజయసాయిరెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన లిక్కర్ పాలసీపై సిట్ అధికారులు తనను నాలుగు ప్రశ్నలు వేశారని, వాటి అన్నింటికీ సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆ పార్టీ నేత రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కీలక విషయాలను మీడియా ఎదుట విజయసాయి వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో హైదరాబాద్, తాడేపల్లిలోని తన ఇళ్లలోనే రెండు సమావేశాలు జరిగినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. 2019 అక్టోబరు, నవంబర్, డిసెంబర్ తర్వాత లిక్కర్ పాలసీపై తనకు ఎలాంటి సమాచారం లేదని, అంతా రాజ్ కసిరెడ్డి మాత్రమే చూసుకున్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇదే సమయంలో లిక్కర్ పాలసీ ద్వారా అనుచితంగా లబ్ది పొందారని అంటున్న అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఉన్నారని విజయసాయి తెలిపారు. ఆ ఇద్దరు వ్యాపారం చేసుకుంటామంటే అరబిందో కంపెనీ నుంచి తాను రూ.100 కోట్లు అప్పు ఇప్పించానని తెలిపారు. ఇందులో అదాన్ డిస్టలరీస్ కి రూ.60 కోట్లు, డికాక్ సంస్థకు రూ.40 కోట్లు అరబిందో శరత్ చంద్రారెడ్డి సమకూర్చారని వివరించారు. అదాన్ డిస్టలరీస్ కి ఇచ్చిన రూ.60 కోట్లు వడ్డీతో కలిసి తిరిగి ఇచ్చేశారని, డికాక్ తీసుకున్న రూ.40 కోట్లలో అసలు మాత్రమే ముట్టిందని చెప్పారు. దీనిపై ఇంకా వివాదం కొనసాగుతోందన్నారు.
దీంతో మద్యం వ్యాపారంలో మిథున్ రెడ్డి పాత్రను విజయసాయిరెడ్డి బయటపెట్టినట్లైందని అంటున్నారు. మద్యం వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విజయసాయిరెడ్డి... వైసీపీలోని కీలక నేతలైన మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిపై సిట్ అధికారులకు స్పష్టమైన సమాచారం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో వారిపై సిట్ ఎలాంచి చర్యలు తీసుకుంటుందోననేది ఉత్కంఠకు గురిచేస్తోంది.