రూ.100 కోట్ల లింకుపైనే ప్రశ్నలు.. మిథున్ రెడ్డికి చిక్కులేనా?
విచారణకు రావాల్సిందిగా సిట్ జారీ చేసిన నోటీసులతో శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ సీపీ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు.
By: Tupaki Desk | 19 April 2025 1:30 PMఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ శనివారం ముగిసింది. సుమారు 8 గంటలపాటు విచారణ అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మిథున్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు ఆయన సంతకాలు తీసుకున్న తర్వాత విడిచిపెట్టారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించి కీలక విషయాలను రాబట్టినట్లు చెబుతున్నారు. మిథున్ రెడ్డిని మరోసారి విచారించే అవకాశం ఉందని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
విచారణకు రావాల్సిందిగా సిట్ జారీ చేసిన నోటీసులతో శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ సీపీ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. హైకోర్టు సూచనలతో ఆయన తన న్యాయవాదితో విచారణకు రాగా, పోలీసులు అనుమతించారు. మద్యం పాలసీ రూపకల్పన, మిథున్ రెడ్డి ప్రమేయం, ఆదాన్, డికాక్ డిస్టలరీల్లో పెట్టుబడులు వంటివాటిపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఏపీ బెవరేజేస్ నుంచి మద్యం కొనుగోళ్లు, కమీషన్ చెల్లింపులు, నగదు లావాదేవీలు వంటి వాటిపై ఎంపీ మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేసినట్లు చెబుతున్నారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఎంపీ మిథున్ రెడ్డికి 30 నుంచి 40 ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు. ప్రధానంగా సాయిరెడ్డి సిఫార్సుతో తీసుకున్న రూ.100 కోట్ల అప్పుతో ఏం చేశారు? ఆ అప్పును తిరిగి ఎలా చెల్లించారు? రాజ్ కసిరెడ్డి కంపెనీలు అయిన ఆదాన్, డికాక్ డిస్టలరీలతో మీకు ఏం సంబంధం వంటి ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారున. అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్ లేదా ఇతర అధికారిక కార్యాలయాల్లో రూపొందించాల్సిన సమావేశాలను విజయసాయిరెడ్డి ఇంట్లో ఎందుకు నిర్వహించారు? అందులో మీరెందుకు పాల్గొన్నారు? వంటివాటిపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు చెబుతున్నారు.
ఎంపీగా మద్యం పాలసీతో తనకు సంబంధం లేదని చెబుతున్న విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశానికి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ ను ఎందుకు పిలిచారు. వారితో ఏం చర్చించారు? అన్న విషయాలపై ప్రశ్నించారని చెబుతున్నారు. అదేవిధంగా రాజ్ కసిరెడ్డి అనుచరులుగా విజయసాయిరెడ్డి చెప్పిన చాణక్య రాజ్, అవినాశ్ రెడ్డితో మిథున్ రెడ్డి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీసారని అంటున్నారు. మొత్తం వివిధ అంశాలపై మిథున్ రెడ్డిని ప్రశ్నించగా, కొన్నింటికి ఆయన సరైన సమాధానాలు చెప్పలేదన్న కారణంగా మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు. ఈ సారి మాజీ ఎంపీ విజయసాయి, ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి ఒకే రోజు విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.