ఆ రెండు పధకాల ఊసు లేకుండానే !
తల్లికి వందనం పధకానికి ఇదే సరైన సమయం అని అంటున్నారు. ఈ నెల 12 నుంచే తరగతులు ప్రారంభం అవుతున్నాయి.
By: Tupaki Desk | 5 Jun 2025 3:46 AMఏపీలో జనాలు ఎంతో ఆశగా చూస్తున్న రెండు కీలక పథకాలు మీద మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందా అంటే లేదు అనే అంటున్నారు. ఇంతకీ ఆ రెండు పధకాలు ఏమిటి అంటే ఒకటి తల్లికి వందనం పధకం, మరొకటి రైతులకు అన్నదాత సుఖీభవ పధకం. ఈ రెండు పధకాలకు ముహూర్తాలు డేట్స్ కూడా కూటమి నేతలు ఇచ్చి చాలా కాలం అవుతోంది.
అదిగో ఇదిగో అంటూ ఒక ఏడాదిని తోసుకుని వచ్చారు. ఇపుడు రెండవ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న వేళ జరిగిన మంత్రి వర్గ సమావేశం ఎంతో కీలకం అని అంతా అనుకున్నారు. ఈ మంత్రి వర్గ సమావేశంలో రెండు పధకాల గురించి చర్చిస్తారు అని వాటి అమలుకు డేట్ ఫిక్స్ చేస్తారు అని అంతా భావించారు కానీ ఎక్కడా ఆ ఊసే లేదు అని అంటున్నారు.
తల్లికి వందనం పధకానికి ఇదే సరైన సమయం అని అంటున్నారు. ఈ నెల 12 నుంచే తరగతులు ప్రారంభం అవుతున్నాయి. దాంతో విద్యార్ధులకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అది తల్లులకు భారం అవుతుంది. అందుకే ఈ పధకం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి మే నెలలోనే ఈ పధకం అమలు చేస్తామని చెప్పారు కానీ ఎందుకో జూన్ కి తీసుకుని వచ్చారు. ఈ పధకానికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించారని బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించారని ప్రచారం సాగింది.
ఇక పధకానికి పచ్చ జెండా ఊపడం తరువాయి అని అనుకుంటున్న వేళ మంత్రి వర్గ సమావేశంలో ఎందుకు చర్చించలేదు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. మంత్రి వర్గంలో చర్చ పెట్టకుండానే ఈ పధకం అమలు చేసే ఆలోచన ఏమైనా ఉందా అన్నదే సందేహంగా ఉంది.
ఇక రైతులకు ఖరీఫ్ సీజన్ చాలా ముఖ్యం. పెట్టుబడులకు నిధులు వారికి పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. దాంతో వారికి కూడా అన్న దాతా సుఖీభవ పధకం అమలు చేస్తే చాలా ఊరటగా ఉంటుందని అంటున్నారు. ఆ పధకాన్ని కూడా తొందరలో అమలు చేస్తామని కూటమి నేతలు చెబుతూ వచ్చారు. దాని కోసం ఏకంగా అరవై లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు.
కానీ ఆ పధకం కూడా ఇపుడు అమలు అవుతుందా లేదా అన్న పెద్ద డౌట్ పట్టుకుంది. ఇంకో వైపు చూస్తే ఎక్కువగా పోలీస్ శాఖ గురించి అలాగే రెవిన్యూ శాఖ గురించే మంత్రి వర్గం ఫోకస్ పెట్టింది. వాటికి సంబంధించిన విషయాలనే చర్చించింది. దీంతో పాటు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ మీద కూడా సమావేశంలో చర్చ సాగింది.
అంతే కాదు ఈ నెల 12న కూటమి ప్రభుత్వం ప్రమాణం చేసి ఏడాది అవుతుంది. ఆ రోజున కొత్త పధకాలను ప్రకటిస్తారని కూడా ప్రచారం సాగింది. కానీ ఇపుడు అది కూడా ఏమైనా ఉందా లేదా అన్నదే చర్చగా ఉంది. నిధుల కొరత వల్లనే పధకాల విషయంలో ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ పధకాలు కరెక్ట్ టైం లో పట్టాలెక్కుతాయో లేక వాయిదా పడతాయో.