Begin typing your search above and press return to search.

మూడేళ్ల క్రితం మరణాలపై తాజాగా విచారణ.. వైసీపీ నేతలకు మరో చిక్కు

2022లో జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై దర్యాప్తు జరిపేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   20 May 2025 9:52 AM
మూడేళ్ల క్రితం మరణాలపై తాజాగా విచారణ.. వైసీపీ నేతలకు మరో చిక్కు
X

ఏపీలో కూటమి ప్రభుత్వం రోజుకొక కేసును తెరపైకి తెస్తోంది. ఒక వైపు లిక్కర్ స్కాంలో దర్యాప్తు జరుపుతూ వైసీపీకి చెందిన కీలక నేతలను టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, మరోవైపు మూడేళ్ల క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై తాజాగా విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో కల్తీ సారా తాగడంతో జంగారెడ్డిగూడెంలో 20 మంది మరణించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, అప్పటి ప్రభుత్వం ఆ ప్రచారాన్ని కొట్టివేయడమే కాకుండా, అవన్నీ సహజ మరణాలేనని కేసు లేకుండా చేసింది. ఈ వ్యవహారంలో కొందరు వైసీపీ నేతల పాత్ర ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వ పెద్దలు నాటి ఘటనపై విచారణ జరపాలని నిర్ణయించారు.

2022లో జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై దర్యాప్తు జరిపేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఘటనలో అప్పట్లో సుమారు 20 మంది మరణించారని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ మరణాలను ధ్రువీకరించకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అవి సహజ మరణాలంటూ బుకాయించిందని టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతున్నారు. అవి కచ్చితంగా కల్తీ సారా మరణాలేనని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రకటించారు. దీంతో అప్పడు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. డీజీపీ హరీశ్ కుమారు దీనిపై ఓ నివేదిక సిద్ధం చేసి సీఎం చంద్రబాబుకు సమర్పించారు.

డీజీపీ నివేదిక ఆధారంగా తాడేపల్లిగూడెం ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ టాస్క్ ఫోర్సులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, రంగరాయ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. ఈ మరణాలపై అప్పట్లో 4 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన వెనుక కొందరు వైసీపీ నేతలు ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ కారణంగానే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అప్పటి కుట్రను నిగ్గుతేల్చాలని నిర్ణయించడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.

2022 మార్చి నెలలో జంగారెడ్డిగూడెం సమీపంలో సుమారు 20 మంది మరణించారు. అంతా ఆ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యే ప్రాణాలు విడిచారు వాంతులు, కడుపునొప్పి, నాడి పడిపోవడం, నిస్సత్తువ వంటి ఒకే రకమైన లక్షణాలతో 20 మంది మరణించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆస్పత్రికి వెళ్లేలోగా మరణించగా, కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అందరూ కల్తీ మద్యం తాగడం వల్లే మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై పోలసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. విచారణకు ఆదేశించడం గానీ, జిల్లా యంత్రాంగం నుంచి నివేదికలు తెప్పించుకోవడం కానీ చేయలేదు. అదేసమయంలో ఈ అంశంపై టీడీపీ శాసనమండలి, శాసనసభలో ఆందోళన నిర్వహించింది. రాష్ట్రంలో కల్తీ సారా తయారీయే లేదంటూ అప్పటి సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇక జంగారెడ్డిగూడెం వెళ్లిన నాటి ప్రతిపక్ష నేత ఈ ఘటనపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అయితే మూడేళ్ల తర్వాత ప్రభుత్వం నాటి ఘటనపై విచారణకు ఆదేశించడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చమటలు పడుతున్నాయని అంటున్నారు.