టీటీడీకి ఏపీజీబీ భారీ విరాళం... ఆ మొత్తం దేనికోసమంటే..?
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ).. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి ఆర్థిక సహాయం అందించింది.
By: Tupaki Desk | 16 July 2025 11:57 AM ISTఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ).. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి ఆర్థిక సహాయం అందించింది. ఇందులో భాగంగా... తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా సామాగ్రి ఏర్పాటు కోసం రూ.44.81 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇది వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా అందించిందని తెలుస్తోంది.
అవును... ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీ.ఎస్.ఆర్.) కార్యక్రమాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆర్థిక సహాయం అందించింది. ఇందులో భాగంగా.. తిరుమలకు వెళ్లే యాత్రికులకు కీలకమైన ప్రవేశ కేంద్రమైన అలిపిరి చెక్ పోస్ట్ వద్ద సెక్యూరిటీ లగేజ్ స్కానర్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించింది.
దీనికి సంబంధించిన మొత్తం రూ.44,81,059 చెక్కును ఏపీజీబీ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి.. తిరుమలలో టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ చర్య భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వెంకన్నను సందర్శించే భక్తులకు సురక్షితమైన యాత్ర అనుభవాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా తీసుకోబడింది!
ఒకే దేశం.. ఒకే రీజనల్ రూరల్ బ్యాంక్ (ఆర్.ఆర్.బీ) ప్రణాళికలో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరిట ఉండే నాలుగు వేర్వేరు గ్రామీణ బ్యాంకులు కలిసి ఏకీకరణలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారిన సంగతి తెలిసిందే.
దీని ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండగా.. దీనికి యూనియన్ బ్యాంక్ స్పాన్సర్డ్ బ్యాంక్ గా వ్యవహరిస్తుంది. ప్రజా ప్రయోజనాలు, గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాల దృష్ట్యా రీజినల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ - 1976ను అనుసరించి ఈ ఏకీకృత ప్రక్రియను ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలుచేసింది!
