Begin typing your search above and press return to search.

ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆక్వా రైతులకు పండుగే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల్ని పెంచడంతో ఎగుమతులు నిలిచిపోయి సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

By:  Tupaki Desk   |   12 April 2025 12:06 PM IST
AP Govt Eases Aqua Farmers Woes
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల్ని పెంచడంతో ఎగుమతులు నిలిచిపోయి సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ముఖ్యంగా రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారి విజ్ఞప్తి మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రొయ్యల మేత ధరను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రైతులకు భారీ ఊరట లభించనుంది. ఈ మేరకు రొయ్యల మేత తయారీదారుల సంఘం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అమెరికాకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రొయ్యల సాగు ఖర్చును తగ్గించేందుకు రొయ్యల మేత ధరను తగ్గించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రైతుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. రొయ్యల మేత తయారీదారులతో చర్చలు జరిపి ధరలు తగ్గించేందుకు వారిని ఒప్పించింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రొయ్యల మేత తయారీదారుల సంఘం అధ్యక్షుడు బీద మస్తాన్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రొయ్యల మేత ధరను కిలోకు ఏకంగా 4 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఇకపై కొనుగోలు చేసే ప్రతి కిలో మేతపై 4 రూపాయలు ఆదా చేసుకోనున్నారు. ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రైతులకు నిజంగా ఊరటనిచ్చే అంశం.

అమెరికాకు ఎగుమతుల విషయంలో ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో, రాష్ట్రంలోని రొయ్యల రైతులు దేశీయంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో రొయ్యల మేత ధర తగ్గడం వారికి మరింత ఊతమిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆక్వా రంగంలోని రైతులకు ఒక పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.