బాబు ఇచ్చిన మాట: కొత్త జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో కందుకూరు నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు
By: Garuda Media | 16 Aug 2025 9:45 AM ISTవైసీపీ హయాంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో కందుకూరు నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు. అప్పట్లో జిల్లాల పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజా భీష్టం మేరకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పశ్చిమ ప్రకాశంలోని ఐదు నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయనున్నారు.
2023, ఏప్రిల్ 20న అప్పటి ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇక్కడి వారు చాలానే ఆశలు పెట్టుకున్నా రు. ఇక, ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరమీదికి వచ్చింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృ త్వంలో ఏర్పడిన కమిటీ.. జిల్లాలపై అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని నిర్ణయించారు. ఆయన చెప్పినట్టుగా మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పడనుంది.
జిల్లాలో మార్పులు చేర్పులకు అనుగుణంగా అమరావతిలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆవశ్యకతపై జిల్లాకు చెందిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు వినతిపత్రం అందజేశారు. 2026 లో జరగనున్న జన గణనలోగా మార్కాపురం జిల్లా ఏర్పాటుపై స్పష్టత రానుంది. మార్కాపురం జిల్లా కేంద్రంగా గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.
దీంతో చంద్రబాబు ఇక్కడి వారికి ఇచ్చిన హామీ అమలైనట్టుగా భావించాలి. ఇక, ఒంగోలు, కొండేపి సంత నూతులపాడు కందుకూరు అద్దంకి నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం వీటిని విభజించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అయితే.. రాజకీయంగా ఇబ్బందులు రాకుండా.. నియోజకవర్గాల ప్రజలకు జిల్లా కేంద్రం సుదూరంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే జరిగితే.. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు.. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీ కూడా నెరవేరుతుందని భావిస్తున్నారు.
