Begin typing your search above and press return to search.

'కూట‌మి' ఐక్య‌త‌కు మోడీ అభ‌యం.. ఎంత సీరియ‌స్ అంటే.. !

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పరంగా కూడా నాయకులు అడుగులు వేశారు

By:  Tupaki Desk   |   29 Jun 2025 6:00 PM IST
కూట‌మి ఐక్య‌త‌కు మోడీ అభ‌యం.. ఎంత సీరియ‌స్ అంటే.. !
X

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పరంగా కూడా నాయకులు అడుగులు వేశారు. పింఛన్ల పెంపు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల వరకు తొలి ఏడాది అమలు చేశారు. అదే సమయంలో అమరావతి ప్రాజెక్టును లైన్ లో పెట్టారు. ముందుకు సాగిస్తున్నారు. ఇక నాయకుల పరంగా చూసుకుంటే పై స్థాయిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడిగా కలిసి ఉంటున్నారు. బిజెపి కూడా కలిసే ఉంటుంది. అయినప్పటికీ అంతర్గత విభేదాలు క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సఖ్యత లోపిస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి.

చాలా నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు కూటమి మంత్రుల మధ్య సఖ్యత లేదనేది వాస్తవం. ఈ విషయం సీఎం చంద్రబాబు కూడా పదేపదే చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తున్న కొందరు విశ్లేషకులు ఈ కూటమిలో విభేదాలు వస్తాయని చెప్పుకొస్తున్నారు. అయితే దీనిలో వైసిపి ప్రయోజనాలు ఉన్నాయా లేకపోతే రాజకీయంగా నిజంగానే వారు వేస్తున్న అంచనాలు నిజమా అనేది పక్కన పెడితే.. అసలు వాస్తవం ఏంటి కూటమి నిజంగానే బెసుకుతుందా? అనేది ఆసక్తికర అంశం. ఈ విషయాన్ని పరిగణన‌లోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల వరకు కూడా కూటమికి ఎటువంటి అపాయం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని నరేంద్ర మోడీ. గత ఎన్నికల ముందు కూటమి కట్టడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నం చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కూటమి కట్టారు అధికారంలోకి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ కూటమి అవసరం చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్ కు ఉన్న లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే పూర్తిస్థాయి మెజారిటీతో 134 మంది ఎమ్మెల్యేలతో టిడిపి బలంగా ఉంది. కాబట్టి కూటమి విడిపోయిన టిడిపి ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక‌, జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాబట్టి తాము బయటకు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందనేది వారి భావ‌న‌. ఇక ఎటోచ్చీ బిజెపికి మాత్రం తీవ్ర నష్టం జరుగుతుంది. అది ఎలా అంటే.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నా ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి ఎట్లా ఉన్నా.. కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉండడానికి కారణం కూటమిగా ఉన్న ఏపీ నుంచి మద్దతిస్తున్న ఎంపీలు మాత్రమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కూటమిని కాపాడుకోవడం అనేది ఇప్పుడు పవన్ చేతుల్లో కానీ చంద్రబాబు చేతుల్లో కానీ లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలోనే ఉంది. ఆయనకి ఇప్పుడు కూటమి అవసరం కాబట్టి.. కూటమి బాగానే ఉంటుంది.

ఒకవేళ నిజంగా విభేదాలు త‌లెత్తితే.. కేంద్రమే రంగంలోకి దిగి అవసరమైతే చర్చలు జరిపి కూట‌మిని కాపాడుకునే పరిస్థితి ఉంది. తప్ప కూటమిని విచ్చిన్నం చేసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండాలి. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ విజయం దక్కించుకోవాలి అంటే కచ్చితంగా ఏపీ ఇప్పుడు ప్రధాని మోడీకి చాలా అవసరం. సో ఓటమిలో విబేధాలు ఉన్నా.. ఐక్య‌త విష‌యంలో ఎలాంటి వ్య‌తిరేక‌ చర్చకు తావు లేదనేది పరిశీలకులు చెబుతున్న మాట.