సభా సమరం: ఏసీ అసెంబ్లీలో పూనకాలే.. !
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 11 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ముహూర్తమే.. సభల అజెండాను స్పష్టం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
By: Garuda Media | 2 Feb 2026 6:10 PM ISTఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 11 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ముహూర్తమే.. సభల అజెండాను స్పష్టం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కిన నేపథ్యంలో గత రెండు సార్లుగా కూడా.. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ అంకెను గుర్తు చేసేందుకు.. 11వ తారీకునే సభలను ప్రారంభిస్తోంది. అదే సమయంలో 11 రోజులు నిర్వహించి.. గతంలో సభలను ముగించింది.
ఇక, ఇప్పుడు కూడా 11వ తారీకునే సభను ప్రారంభించడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకా రం.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం.. ఈ నెల 11న ప్రారంభమయ్యే సమావేశాలు కూడా 11 రోజులు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే, ఈ సమావేశాల్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. తొలుత బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అయితే.. ఇది ప్రాథమిక అంశం.
కానీ, ఒకింత లోతుగా చూస్తే.. ఈ సమావేశాల్లో పూనకాలు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ సభలో ఉన్నా.. లేకున్నా.. గత నాలుగు మాసాలుగా వైసీపీ చేస్తున్న రాజకీయాలను సభా వేదికగా పెద్ద ఎత్తున చర్చించనున్నారు. తీవ్రస్థాయిలో వైసీపీపై ప్రభుత్వ పక్షం నిప్పులు చెరిగే అవకాశం ఉంది. పీపీపీ విధానాన్ని వైసీపీ వ్యతిరేకించిన నేపథ్యంలో దీనిపై సభలో సీఎం చంద్రబాబు సమగ్ర వివరణ ఇవ్వనున్నట్టు తెలిసింది. అదేవిధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం సభను కుదిపేయనుంది.
ఇక, తాజాగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు.. గతంలో చంద్రబాబును వేధించిన తీరు.. వంటివి మరోసారి సభలో వైసీపీని ఎండగట్టేలా చేయనున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులు.. కేంద్రంతో ఉన్న బంధం.. కూటమి ప్రయోజనాలు.. ఇలా అనేక అంశాలపై సభలో పెద్ద ఎత్తున చర్చించేందుకు ఇప్పటికే కార్యరంగం రెడీ అయిందని తెలుస్తోంది. సో.. మొత్తం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూనకాలేనని అంటున్నారు టీడీపీ నాయకులు.
