42 ఏళ్ల వ్యక్తికి 22 ఏళ్ల యువతితో వివాహం.. అడ్డుకున్న భక్తులు!
పెళ్లి అనేది రెండు మనసులు ఒక్కటయ్యే వేడుక. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను ఒకరితో ఒకరు పంచుకునేందుకు తీసుకునే అందమైన నిర్ణయం.
By: Tupaki Desk | 19 April 2025 10:30 AMపెళ్లి అనేది రెండు మనసులు ఒక్కటయ్యే వేడుక. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను ఒకరితో ఒకరు పంచుకునేందుకు తీసుకునే అందమైన నిర్ణయం. అలాంటి పెళ్లికి ఈడుజోడు సరిపోవాలి. పెళ్లి చేయాలంటే ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు చూడాలని అంటారు పెద్దలు. అలాంటి బలవంతంగా పెళ్లి చేసుకుంటే భార్యభర్తలు ఇద్దరూ జీవితాంతం నరకం అనుభవించాల్సి ఉంటుంది. వారు కోరుకున్న క్వాలిటీస్ ఉన్నవారు దొరకక పోతే ఆ బాధ వర్ణణాతీతం. పేరెంట్స్ బలవంతంగా పెళ్లి చేసినా తర్వాత అనుభవించేది మాత్రం ఆ వధూవరులే. అలాంటి ఓ పెళ్లిని అన్నవరంలో స్థానిక భక్తులు అడ్డుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం నిన్న పెళ్లి సందడితో నిండిపోయింది. ఎటు చూసినా పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నజంటలు కనిపించాయి. కానీ, ఈ సంతోషకరమైన వాతావరణం ఉన్నట్లుండి విషాదంలోకి మారిపోయింది. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఒక పెళ్లి తంతు అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లి పీటలపై కూర్చున్న వధువు ఏడుస్తూ కనిపించడంతో అక్కడ ఉన్న భక్తులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అన్నవరం దేవస్థానంలో ఒక 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. పెళ్లి తంతు జరుగుతుండగా, పెళ్లి పీటలపై వధువు బిగ్గరగా ఏడుస్తుండడం చూసిన కొందరు భక్తులు అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఆనందంగా ఉండాల్సింది పోయి.. అమ్మాయి ఎందుకు అంతలా బాధపడుతోందని వారు ఆరా తీయడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆలయ భద్రతా సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
పెళ్లి పీటలపై ఏడుస్తున్న యువతిని చూసిన ఒక మహిళా భక్తురాలు ఆమెను దగ్గరకు వెళ్లి విషయం అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించింది. మొదట భయపడిన ఆ యువతి, తర్వాత తన గోడు వెళ్లబోసుకుంది. తన ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారని కన్నీటితో చెప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బాల్య వివాహం కాదని స్పష్టంగా తెలుస్తున్నా, ఒక యువతిని బలవంతంగా వివాహం చేసుకోవడానికి ప్రయత్నించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే భక్తులు, భద్రతా సిబ్బంది కలిసి ఆ పెళ్లిని అడ్డుకున్నారు.పెళ్లి కొడుకు, అతడి కుటుంబ సభ్యులను నిలదీశారు. కొందరు భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పెళ్లి కుమార్తెను, పెళ్లి కొడుకును, వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన అన్నవరం దేవస్థానంలో కలకలం రేపింది.