అన్న దాతకు గుడ్ న్యూస్ చెప్పిన బాబు
అయితే 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా అన్నదాత సుఖీభవ పధకాన్ని అమలు చేయలేదు. దాంతో రైతులలో ఆందోళన మొదలైంది.
By: Tupaki Desk | 22 April 2025 10:54 AMఅన్నదాత అంటే మొదటిగా సమాజం గౌరవించుకోవాల్సిన వాడు. పట్టెడు అన్నం ప్రజలకు పెట్టేవాడు. అటువంటి అన్న దాతకు ఎంత సాయం చేసినా తప్పులేదు. వ్యవసాయంలో సాయం ఉంది. కానీ రైతుకు మాత్రం అది దక్కడం లేదు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అన్నదాతను ఆదుకుంటామని హామీ ఇచ్చింది.
వారికి అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా నిధులను పెంచుతామని ప్రకటించింది. ఏకంగా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టం చేసింది. అయితే 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా అన్నదాత సుఖీభవ పధకాన్ని అమలు చేయలేదు. దాంతో రైతులలో ఆందోళన మొదలైంది.
అయితే అన్ని వివరాలు చూసుకుంటూ పకడ్బందీగా ఈ పధకాన్ని అమలు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ సమయం తీసుకుంది అని అంటున్నారు. ఇక ఈ పథకంలో మార్పు ఏంటి అంటే మూడు విడతలుగా చెల్లించడం. అంతే కాదు కేంద్రం ఇచ్చే పీఈం కిసాన్ సమ్మాన్ పధకం నిధులను కూడా కలుపుకుంటూ ఇవ్వడం. ఈ లెక్కన ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చేది పద్నాలుగు వేలు అన్న మాట. ఆ మిగిలిన ఆరు వేలూ కేంద్రం కిసాన్ సమ్మాన్ నుంచి ఇస్తుంది.
ఈ విధంగా ప్రతీ విడతలో కూటమి ప్రభుత్వం నాలుగు వేలు కేంద్రం నుంచి రెండు వేలు కలిపి ఆరు వేల రూపాయలు చెల్లిస్తారు. ఇక అన్నదాత సుఖీభవ పధకాన్ని మే నెలలో ప్రారంభిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
దాంతో రైతులకు ఖరీఫ్ సీజన్ కోసం ఆరు వేల రూపాయలు మొదటి విడతగా దక్కే చాన్స్ ఉంది. అలాగే రబీ సీజన్ కి ముందు మరో ఆరు వేలు, సంక్రాంతి తరువాత ఫిబ్రవరి నెలలో మరో ఎనిమిది వేల రూపాయలు దక్కుతాయని అంటున్నారు.
మొత్తానికి రైతన్న కష్టాలు తీరేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని అంటున్నారు. ఇక చూస్తే కిసాన్ సమ్మాన్ పధకం కింద ఏపీలో 42 లక్షల మంది రైతులకే లబ్ది చేకూరుతోంది. వారికే ఈ పధకం ద్వారా సొమ్ము అందుతోంది. కేంద్రంతో కలసి కూటమి ప్రభుత్వం నిధులు ఇస్తే కనుక ఆ 42 లక్షల మంది రైతులనే లబ్దిదారులుగా పరిగణనలోకి తీసుకుంటుందా అన్న చర్చ ఉంది. ఏపీలో చూస్తే ఒక అంచనా మేరకు 60 లక్షల మంది రైతులు ఉన్నారు.
వారందరికీ అన్నదాత సుఖీభవ పధకాన్ని వర్తింపచేయాల్సి ఉంది. పీఈం కిసాన్ సమ్మాన్ పధకం లబ్దిదారులనే ప్రమాణంగా తీసుకుంటే కనుక ఏకంగా 18 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అయితే 42 లక్షల మంది రైతులకే అన్నదాత సుఖీభవ అందచేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.