ఏపీలో అన్నా క్యాంటీన్లకు పెరిగిన సందడి.. రీజన్ ఇదే...!
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్లు.. పేదల కడుపు నింపుతున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 22 May 2026 6:00 AM ISTరాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్లు.. పేదల కడుపు నింపుతున్న విషయం తెలిసిందే. ఉదయం-మధ్యాహ్నం-రాత్రి మూడు పూటలా రూ.5 కే ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే.. నిన్న మొన్నటి వరకు ఈ క్యాంటీన్లకు ప్రజల్లో మంచి స్పందన ఉన్నా.. ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. ఊహించని రీతిలో క్యాంటీన్లకు జనాభా పెరుగుతున్నారు.
ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకు కూడా.. పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తు న్నాయి. తాజాగా ప్రభుత్వం సేకరించిన డేటా ప్రకారం.. క్యాంటీన్లలో భోజనం చేస్తున్న వారి సంఖ్య గత వారంలోనే 50 శాతం మేరకు పెరిగిపోయింది. ఒకరకంగా హాట్ కేక్ల మాదిరిగా.. క్యాంటీన్లు మారిపోయా యి. ఈ క్యాంటీన్లు స్థానిక సంస్థలు + ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో తక్కువ ధరలకే ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే.. గత వారం నుంచి తెచ్చిన పదార్థాలు సరిపోక.. సగం మంది వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారన్నది.. ప్రభుత్వానికి అందిన నివేదిక. భారీ సంఖ్యలో పెరుగుతున్నారని.. వారికి చాలి నంత ఆహారం అందించేందుకు.. సామర్థ్యం సరిపోవడం లేదని కూడా.. హరే కృష్ణ సంస్థ.. అంతర్గత నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఏంటి కారణం..
ప్రస్తుతం నెలకొన్న ఇంధన ఇబ్బందులు.. తద్వారా పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బయట ఏ వస్తువును కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు అన్నా క్యాంటీన్ల బాటపడుతున్నారు. ఒకప్పుడు.. సాధారణ కార్మికులు, రిక్షాపుల్లర్లు, నిరుద్యోగులు మాత్రమే ఇక్కడ భోజనం చేయగా.. ఇప్పుడుకుటుంబాలకు కుటుంబాలు.. అన్న క్యాంటీన్కు పోటెత్తుతున్నారు. అయితే.. ఎంత మంది వచ్చినా.. భోజనం పెట్టాలని.. దీనికి సంబంధించి ఎలాంటి పునరాలోచన లేదని ప్రభుత్వం చెబుతోంది.
