Begin typing your search above and press return to search.

గుర్తుకు వచ్చిందా? అంజూ భారత్ కు వచ్చేసింది!

కొన్ని నెలల క్రితం ప్రియుడి కోసం భర్తను పిల్లల్ని వదిలేసి వెళ్లిన ఆమె.. తాజాగా వాఘా సరిహద్దుల్ని దాటి భారత్ లోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 4:57 AM GMT
గుర్తుకు వచ్చిందా? అంజూ భారత్ కు వచ్చేసింది!
X

పెళ్లై.. ఇద్దరు పిల్లల తల్లైన అంజూ ఫేస్ బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్ కు వెళ్లటం.. అతడ్ని పెళ్లాడటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో తాజాగా మరో మలుపు తిరిగింది.కొన్ని నెలల క్రితం ప్రియుడి కోసం భర్తను పిల్లల్ని వదిలేసి వెళ్లిన ఆమె.. తాజాగా వాఘా సరిహద్దుల్ని దాటి భారత్ లోకి వచ్చారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన 34 ఏళ్ల అంజూకు 2019లో పాక్ కు చెందిన 20 ఏళ్ల నస్రుల్లా అనే యువకుడితో పెళ్లైన సంగతి తెలిసిందే.

నస్రుల్లాను కలిసేందుకు పాక్ కు వెళ్లిన ఆమె.. అనూహ్యంగా అతడ్ని పెళ్లాడటం.. ఫాతిమాగా మారటం తెలిసిందే. ఈ వైనం పెను దుమారాన్నిరేపింది. భర్త తరఫు వారు పలు సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఆమె నిర్వాకంతో ఆమె కుటుంబ సభ్యులకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమెను పాక్ నుంచి తీసుకొస్తామని తొలుత చెప్పిన కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత ఆమెతో తెగ తెంపులు చేసుకోవటం తెలిసిందే. అయితే.. ఆమెను రెండో పెళ్లి చేసుకున్న నస్రుల్లా మాత్రం ఆమె తిరిగి భారత్ కు వస్తుందని చెప్పారు.

చెప్పినట్లే.. ఆమెను పాక్ సరిహద్దుల వద్ద వరకు వచ్చిన నస్రుల్లా కుటుంబ సభ్యులు ఆమెను భారత్ లోకి సాగనంపారు. ఆమె తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తుందని.. పిల్లల్ని చూడాలని తపిస్తుందని.. ఈ కారణంతోనే భారత్ కు వెళుతున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వాఘా సరిహద్దు నుంచి భారత్ లోకి ప్రవేశించిన ఆమె.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తన కుటుంబాన్ని కలిసేందుకు ఇష్టపూర్వకంగానే భారత్ కు వచ్చినట్లుగా పేర్కొన్నారు. మరి.. ఆమె కుటుంబ సభ్యులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి. భారత్ లోకి వచ్చిన ఆమె.. ఇస్లాం తరహాలో కట్టు తీరుతో వచ్చారు.