Begin typing your search above and press return to search.

అనిల్ డిఫెన్స్ లో పడిపోయారా? అందుకేనా ఎదురుదాడి!

మాజీ మంత్రి, నెల్లూరు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 May 2025 5:30 PM
Anil Kumar Yadav Breaks Silence in Nellore Politics
X

మాజీ మంత్రి, నెల్లూరు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసిన అనిల్ కుమార్ యాదవ్ గత కొంతకాలంగా సైలెంటుగా ఉన్న విషయం తెలిసిందే. అధికారంలో ఉండగా, నెల్లూరులోని పార్టీ నేతలు అందరితోనూ విభేదాలతో సతమతమైన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆకస్మాత్తుగా స్లైట్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంటుగా ఉన్న ఆయన ఒక్కసారిగా స్వరం పెంచి హాట్ కామెంట్స్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.

కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను వరుసగా అరెస్టుచేసి జైలుకు పంపుతున్న నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తనను టచ్ చేస్తే మీ అందరి జాతకాలు బయటపెడతానని ఇటీవల ఆయన చేసిన హెచ్చరిక తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదు అవడంతో ఆయన అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న హెచ్చరికలు ఇంట్రస్టింగుగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమిలోని బడా నేతలుగా ముద్రపడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను లక్ష్యంగా చేసుకుంటూ అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న విమర్శలు చర్చకు దారితీస్తున్నాయి.

గతంలో ఎంపీ వేమిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కలిసిపనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తన జోలికి వస్తే అప్పటి విషయాలను చెప్పేస్తానని అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న హెచ్చరికలు ఎంపీ వేమిరెడ్డి వర్గంలో చర్చకు దారితీస్తున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా టీడీపీలో కీలక నేతగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యవహరిస్తున్నారు. ఆయనను కూడా వదిలిపెట్టనని మాజీ మంత్రి అనిల్ యాదవ్ చెప్పడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల నేతలు తన వరకు రాకూడదనే వ్యూహంతోనే ఆయన ఈ ఎదురుదాడి చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ మంత్రి అనిల్ చేస్తున్న ఆరోపణల్లో ప్రధానంగా సైదాపురం, సిద్దివినాయక మైనింగు సైట్లను ప్రస్తావిస్తున్నారు. ఆ రెండు టీడీపీలోని కీలక నేతలకు సంబంధించినవి కావడం విశేషం. అయితే రాజకీయంగా ప్రస్తుతం బలంగా ఉన్న టీడీపీ నేతలకు చెందిన క్వారీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడమనేది ప్రశ్నార్థకమే. ఈ విషయం తెలిసినా అనిల్ కుమార్ యాదవ్ వాటిపై ఆరోపణలు చేయడం వెనుక వ్యూహం ఉందంటున్నారు. తన ఆత్మరక్షణకు టీడీపీ నేతలను టార్గెట్ చేయడం ఒక్కటే మార్గంగా అనిల్ కుమార్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి కాకాణి విషయంలో పావులు కదిపినట్లు తనను టార్గెట్ చేస్తే తాను టీడీపీ నేతలను వదిలేది లేదనే సంకేతాలు పంపడానికే అనిల్ కుమార్ యాదవ్ ఎదురుదాడి వ్యూహం ఎంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.