Begin typing your search above and press return to search.

ఎవరికీ పట్టని ఏయూ వందేళ్ళ పండుగ !

ఏయూ వందేళ్ళ పండుగ అన్నది ఒక మహా సంబరం. ఘనత వహించిన ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయం గర్వంగా ఒక శతాబ్దిని పూర్తి చేసుకున్న శుభ తరుణం.

By:  Tupaki Desk   |   27 April 2025 2:30 AM
ఎవరికీ పట్టని ఏయూ వందేళ్ళ పండుగ !
X

ఏయూ వందేళ్ళ పండుగ అన్నది ఒక మహా సంబరం. ఘనత వహించిన ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయం గర్వంగా ఒక శతాబ్దిని పూర్తి చేసుకున్న శుభ తరుణం. అచ్చట ఎదిగిన ప్రతీ కొమ్మా ఒక విద్యా వృక్షమై సుగంధాలు పూచింది అనడానికి ఏయూ ఒక అచ్చమైన ఉదాహరణ.

ఏయూ నుంచి ఎందరో దేశంలో కీలక స్థానాలలోకి వెళ్ళారు. రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవులు అందుకున్నారు. అటువంటి గొప్పతనం ఏయూది. ఏయూ 1926 ఏప్రిల్ 26న ఏర్పాటు అయింది. ఏయూ తొలి ఉపాధ్యక్షుడిగా కట్టమంచి రామలింగారెడ్డి పనిచేస్తే రెండవ వీసీగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పనిచేశారు. ఈ ఇద్దరూ ఏయూ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడిన వారు ఇక చూస్తే కనుక ఏయూ నుంచి ఎంతో మంది వీసీలు పనిచేసి ప్రగతి దారి చూపించారు.

ఏయూ నుంచి వెంకయ్యనాయుడు, బాలయోగి కింజరాపు ఎర్రన్నాయుడు వంటి వారు చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళారు. అటువంటి ఏయూ వందేళ్ళ పండుగ అంటే ఎలా ఉండాలి. ఎంతో మంది పెద్ద వారు వచ్చి ప్రారంభించాలి. కానీ ఎవరూ రాకుండానే ఏయూ శతాబ్ది ఉత్సవాలు పేలవంగా మొదలయ్యాయి. విశాఖ బీచ్ రోడ్డులో వాక్ థాన్ నిర్వహించారు. కానీ ఉత్సాహం అయితే పెద్దగా కనిపించలేదు.

ప్రముఖులు వచ్చి ఉంటే ఆ కళ వేరే విధంగా ఉండేది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి కానీ విద్యా మంత్రి కానీ వచ్చి ఉంటే బాగుండేది అన్న మాట వినిపించింది. అలాగే ఇక్కడ చదువుకున్న ప్రముఖులు వచ్చినా వేరే విధంగా ఉండేది అన్న భావన ఉంది. ఎందుకో తెలియదు కానీ వందేళ్ళ పండుగ అని మొదటి నుంచి ఊదరగొట్టినా చివరికి తూతూమంత్రంగా చేశారు అన్న విమర్శలు వచ్చాయి.

తూర్పు తీరంలో సాగరం వాకిట వెలసిన తొలి వర్శిటీగా ఏయూకి పేరు ఉంది. అంతే కాదు ఏయూకి ఈ రోజున దేశ విదేశీ విద్యార్ధులను ఆకర్షిస్తూ ఎన్నో రకాలైన కోర్సులను అందిస్తోంది. నాక్ గ్రేడింగ్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఇలా అన్ని విధాలుగా అలరారుతున్న ఏయూని గురుంచి ఆ వైభవం గురించి గట్టిగా చెప్పడానికి పది మందినీ ఆకట్టుకోవడానికి ఈ ఉత్సవం జరగాలి.

కానీ చేశామంటే చేశామన్న తీరున ఉత్సవాలు జరిపారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏయూ వదేళ్ళ ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవి ఏడాది పొడుగునా సాగుతాయి. మరి ఈ మధ్యలో అయినా ప్రముఖులు వచ్చి ఏయూ గురించి తమదైన మంచి మాటలు నాలుగు చెప్పి ఈ అరుదైన సందర్భాన్ని చిరస్మరణీయం చేస్తారు అన్నది అంతా కోరుకుంటున్నారు.