Begin typing your search above and press return to search.

ఏపీలో 250 సీట్లు...టీడీపీ జనసేన రిక్వెస్ట్ కి ఓకేనా ?

2029 ఎన్నికల్లో పెంచిన సీట్లతోనే పోటీ చేయాలని టీడీపీ జనసేన చూస్తున్నాయి. ఇక రెండు పార్టీలు కూటమిలో కలిసి ఉన్నాయి.

By:  Tupaki Desk   |   1 May 2025 3:59 AM
ఏపీలో 250 సీట్లు...టీడీపీ జనసేన రిక్వెస్ట్ కి ఓకేనా ?
X

ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. 2014లో విభజన తరువాత ఉమ్మడి ఏపీలో ఉన్న 294 సీట్లలో భౌగోళికంగా విడిపోయిన ఏపీకి 175 సీట్లు దక్కితే ఆ మిగిలిన 119 సీట్లతో తెలంగాణా ఏర్పాటు అయింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని విభజన చట్టలో పొందుపరచారు. దాని ప్రకారం ఏపీకి 50 సీట్లు తెలంగాణాకు 30 దాకా సీట్లు పెరగనున్నయి.

కానీ 2014 నుంచి 2024 దాకా మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా సీట్ల పెంపు మాత్రం ఎక్కడా జరగలేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరింది. అయితే 2018 వచ్చేనాటికి ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోయింది.

అలా అప్పట్లో ఏ నిర్ణయం జరగకుండా ఆగిపోయింది. ఇక 2019 నుంచి 2024 వరకూ వైసీపీ అధికారంలో ఉంది. కానీ ఈ సీట్ల పెంపు మీద పెద్దగా ఒత్తిడి అయితే తేలేదు అని అంటున్నారు. ఇక 2024 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏపీలోని టీడీపీ జనసేన ఎంపీలే కేంద్రంలో ప్రభుత్వానికి ఆక్సిజన్ గా మారుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీ సీట్లు ఈ దఫా అయినా పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. 2029 ఎన్నికల్లో పెంచిన సీట్లతోనే పోటీ చేయాలని టీడీపీ జనసేన చూస్తున్నాయి. ఇక రెండు పార్టీలు కూటమిలో కలిసి ఉన్నాయి. అయితే పదవుల పంపిణీ విషయంలో కానీ ఇతరత్రా నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ పెద్ద ఎత్తున పోటీ ఉంటోంది.

టీడీపీలో చాలా మంది నేతలు ఖాళీగా ఉండిపోతున్నారు. అలగే జనసేనకు కూడా సీట్లు అధికంగా కావాల్సి ఉంది. దంతో ఈ రెండు పార్టీలు కలసి కేంద్ర పెద్దలను సీట్ల పెంపు విషయంలో ఒత్తిడి పెడుతున్నాయని అంటున్నారు. ఎక్కువ సీట్లు పెరిగితే కూటమికే మేలు అని ఎక్కువ మందిని తామే గెలిపించుకుని మరోసారి అధికారంలోకి రావచ్చు అని చెబుతున్నారుట.

ఈ నేపథ్యంలో నుంచి చూస్తే కనుక కేంద్రం కూడా ఈ దఫా ఏపీ తెలంగాణాలలో సీట్లు పెంచేందుకు సుముఖంగా ఉందని అంటున్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా సీట్లు పెరిగితే కనుక అది బీజేపీకి కూడా ఉపయోగపడుతుంది అన్నది కేంద్ర పెద్దల భావనగా ఉంది. మరి చూస్తే విభజన చట్టం ప్రకారం కొత్తగా యాభై సీట్లే పెరుగుతాయి. ఈ లెక్కన 225 సీట్లు మాత్రమే ఏపీకి దక్కుతాయి.

కానీ తెలుగుదేశం ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇదే అదనుగా కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని మరో 25 సీట్లు అదనంగా అంటే 250 దాకా అసెంబ్లీ సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అంటే ఏకంగా 75 సీట్లు పెంపు అన్న మాట. ఈ విధంగా పెంచితే చాలా మందికి టీడీపీ నాయకులకు అకామిడేట్ చేయవచ్చు అని ఆలోచిస్తున్నారుట.

ఏపీలో జనాభా బాగా పెరిగిందని, అందువల ప్రతీ రెండు లక్షల లోపు జనాభాకూ ఒక అసెంబ్లీ సీటు వంతున ఇస్తే కనుక 250 సీట్లు వస్తాయని చెబుతున్నారు. మరి కేంద్రం దీని మీద ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే 2026 మధ్య నాటికి ఏపీలో సీట్లు పెంచడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.