Begin typing your search above and press return to search.

వారి వల్లే కూటమికి ఇబ్బందులా ?

వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోరాదు అని చంద్రబాబు పదే పదే క్లాస్ తీసుకుంటున్నా కొందరి వైఖరిలో మార్పు రావడం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 8:30 AM
వారి వల్లే కూటమికి ఇబ్బందులా ?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి అవుతోంది. అయితే ప్రభుత్వం పట్ల కనిపిస్తున్న ఆదరణ కంటే దానిని మించి ఎమ్మెల్యేల పనితీరే జనాలలో వ్యతిరేకతను తెస్తోందని సర్వేలు అనేకం చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చామన్న ఆలోచనతో కొందరు చేస్తున్న తప్పులు మొత్తం కూటమికి చుట్టుకుంటున్నాయని అంటున్నారు.

వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోరాదు అని చంద్రబాబు పదే పదే క్లాస్ తీసుకుంటున్నా కొందరి వైఖరిలో మార్పు రావడం లేదని అంటున్నారు. వారు అధికారాన్ని ఆ మజాని తొలిసారి చూస్తున్నారు. దాంతో దూకుడు చేస్తున్నారు. దీని వల్లనే కూటమికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు.

ఇక చూస్తే కూటమిలో మొత్తం 164 మంది గెలిస్తే అందులో ఈసారి ఏకంగా 88 మంది ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దాంతో ఈ కొత్త ఎమ్మెల్యేలలో చాలా మంది వైఖరి వల్లనే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అంటున్నారు. తమ ప్రాంతాలలో ఇసుక దందాలు అలాగే ఇతరత్రా అవినీతి విషయంలో వీరి ప్రోత్సాహం ఎక్కువగా ఉందని ప్రచారం అయితే సాగుతోంది.

ఇక వైసీపీ హయాంలో చాలా మంది ఇలాగే చేస్తే జనాలు మొత్తం ప్రభుత్వం మీద కోపం తెచ్చుకుని దించేశారు. ఫలితం దారుణంగా వచ్చింది. అది చూసి కూడా కొత్త ఎమ్మెల్యేలు కొందరు గుణపాఠాలు నేర్చుకోకపోగా దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు.

మరోసారి టికెట్ సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్ అన్నది కొందరికి బొత్తిగా పడని మాటలుగా ఉన్నాయని అంటున్నారు. చాన్స్ ఇపుడే ఉంది. దాంతో ఏమైనా చేసేయాల్సిందే అని వారు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో అసలే పధకాలు అందక జనాలు కాక మీద ఉన్నారు. అలాంటి వారికి ఈ తరహా దూకుడుతో ఉన్న కొందరు ఎమ్మెల్యేల తీరు చూస్తే కనుక మరింత ఆగ్రహం కలుగుతోంది అని అంటున్నారు.

చాలా మందికి పవర్ బుర్రలోకి ఎక్కేసింది అని అంటున్నారు. దాంతో రియల్ ఎస్టేట్ దందాలకు దిగుతున్నారు. మద్యం షాపుల వేలం పాటలలో తల దూర్చి మరీ తమ ఆధిపత్యం చాటుకుంటున్నారు. ఇక బెల్ట్ షాపులకు కొందరు సహకరిస్తున్నారు. బార్లా బార్లు తెరచి మరీ జనాలకు ఇబ్బంది కలిగించేలా చర్యలు చేయడం వల్లనే వారికి మాత్రమే కాకుండా యావత్తు ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తోంది అని అంటున్నారు.

ఇవి చాలదన్నట్లుగా కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్య వర్గ పోరు సాగుతోంది. అలాగే ఆధిపత్యం కూడా చాలా చోట్ల ఉంది. దాంతోనే జనాలు విసిగిపోతున్నారు అని అంటున్నారు. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న కూటమి పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు కొన్ని సార్లు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఫలితం ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే ఈ కాలంలో రాజకీయం అలా అయిపోయింది అని అంటున్నారు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు ఇక పండుగే అన్న చందాన ఉన్న కొందరి మైండ్ సెట్ ని మార్చడం సాధ్యం కాకపోతే కూటమిలో కుంపట్లు రేగడం ఖాయమని అంటున్నారు.