అండా సెల్.. నరకానికి ద్వారం.. జైలులోని భయంకరమైన ప్రదేశం
భారతదేశంలోని జైళ్లలో 'అండా సెల్' అనేది అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. ఇది గుడ్డు ఆకారంలో ఉంటుంది.
By: Tupaki Desk | 11 April 2025 2:30 PMభారతదేశంలోని జైళ్లలో 'అండా సెల్' అనేది అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. ఇది గుడ్డు ఆకారంలో ఉంటుంది. ఈ సెల్ లోపల ఖైదీలు నరకయాతన అనుభవిస్తారు. అందుకే ఖైదీలు ఈ అండా సెల్ అంటే వణికిపోతారు. 26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవ్వూర్ రాణాను కూడా తిహార్ జైలులోని అండా సెల్లో ఉంచనున్నారు. ఈ అండా సెల్ ఎందుకు అంత భయంకరమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
అండా సెల్లో ఎప్పుడూ చీకటి ఉంటుంది. ఖైదీలకు కేవలం పడుకోవడానికి ఒక పరుపు మాత్రమే ఉంటుంది. ఇతర సౌకర్యాలు ఏమీ ఉండవు. సెల్ చుట్టూ విద్యుత్ కంచె ఉంటుంది. లోపల, బయట భద్రతా సిబ్బంది నిరంతరం పహారా కాస్తుంటారు. అంతేకాదు ఈ సెల్ను బాంబు పేలుళ్లను తట్టుకునేలా నిర్మిస్తారు. ఖైదీలను పూర్తిగా ఒంటరిగా ఉంచుతారు. అండా సెల్స్లో రెండు.. బాహ్య, అంతర్గత భద్రతా వలయాలు ఉంటాయి. మిగతా బ్యారక్లతో పోలిస్తే అండా సెల్స్ను పర్యవేక్షించడానికి ఎక్కువ మంది జైలు అధికారులు ఉంటారు. అండా సెల్లో జైలుశిక్ష అత్యంత దారుణంగా ఉంటుంది. ఇందులో ఖైదీకి ఏకాంత నిర్బంధం ఉంటుంది. రోజులో 22.5 గంటల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఇనుప కడ్డీలు, జైలు ఊచలు తప్ప మరో మనిషి జాడ కనిపించదు. సెంట్రల్ జైలులో అత్యంత ఒంటరిగా ఉండే సెల్.. అండా సెల్.
అండా సెల్స్ను అత్యంత ప్రమాదకరమైన నేరస్తులను, ఉగ్రవాదులను ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇది జైలులోని అత్యంత సురక్షితమైన ప్రదేశం. భారతదేశంలోని అనేక కేంద్ర కారాగారాలలో అండా సెల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర లోని ఎరవాడ జైలు, నవీ ముంబైలోని తలోజా జైలు, నాగపూర్ సెంట్రల్ జైళ్లలో ఉన్నాయి. ఢిల్లీలోని తీహార్ జైలులో కూడా అండా సెల్ ఉంది. 26/11 దాడిలో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ను కూడా ఇక్కడే ఉంచారు.