డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఈ కేసులోనే జైలుకు వెళ్లిన అనంతబాబు.. తర్వాత.. బయటకు వచ్చారు. అత్యంత హంగామాగా.. ఆయన ను జైలు నుంచి ఇంటికి.. పెళ్లి కొడుకును ఊరేగించినట్టు వైసీపీ నాయకులు ఊరేగించారు.
By: Tupaki Desk | 17 April 2025 4:25 PMవైసీపీ హయాంలో ఆపార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ కారు డ్రైవర్ను దారుణంగా హత్య చేసి.. అతని ఇంటికే తీసుకువచ్చి వదిలేసిన ఘటన గుర్తుంది కదా! ఇది.. 2022లో జరిగింది. అప్పట్లో ఈ కేసు తీవ్రస్థాయిలో సంచలనం సృష్టించింది. రాజకీయంగా కూడా వివాదానికి దారి తీసింది. అయితే.. అప్పటి నుంచి ఈ కేసు విచారణ దశలోనే ఉంది. ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబుపై అప్పటి ప్రభుత్వం తక్కువ శిక్ష పడే సెక్షన్లతో కేసులు నమోదు చేయించిందన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
ఈ కేసులోనే జైలుకు వెళ్లిన అనంతబాబు.. తర్వాత.. బయటకు వచ్చారు. అత్యంత హంగామాగా.. ఆయన ను జైలు నుంచి ఇంటికి.. పెళ్లి కొడుకును ఊరేగించినట్టు వైసీపీ నాయకులు ఊరేగించారు. ఇక, ఇప్పటి వరకు మృతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం అయితే జరగలేదు. పైగా.. అప్పట్లో ప్రభుత్వం తరఫున ఎవరూ న్యాయ వాదులు కూడా వాదించేందుకు ముందుకు రాలేదు. అయితే.. అప్పట్లో ముప్పాళ్ల సుబ్బారావు అనే న్యాయవాది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుబ్రహ్మణ్యం కుటుంబం కోసం పోరాటం చేశారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే.. ముప్పాళ్ల సుబ్బారావును అధికారిక న్యాయవాదిగా ఈ కేసును వాదించేందుకు బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే.. ప్రాసిక్యూషన్కు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్లను నియమించింది. కేసు విచారణ ముగిసే వరకు.. ఆయనకు ఈ బాధ్యతలు ఉంటాయి. కేసుకు సంబంధించిన విషయాలు.. పోలీసులతో చర్చలు వంటివాటిలో ఈయన అధికారికంగా పాల్గొంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.