Begin typing your search above and press return to search.

నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనం: అమిత్‌షా

ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 9:07 AM GMT
నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనం: అమిత్‌షా
X

నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ విముక్తికి అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్‌షాతో పాటు మ‌రో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర‌ అధ్యక్షులు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తొలుత అమరవీరుల స్థూపం వద్ద అమిత్‌షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కలిగిందని, ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని అమిత్‌షా అన్నారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నాన‌ని అమిత్ షా పేర్కొన్నారు. ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో వ‌ల్ల‌భ్ భాయ్‌ పటేల్‌ నిజాం మెడలు వంచారని తెలిపారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారని కొనియాడారు.

పటేల్‌ లేకపోతే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని అమిత్‌షా విమ‌ర్శించారు. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచనం కోసం గొంతెత్తిన పార్టీ బీజేపీయేనని అన్నారు.

నిజాంకు వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్‌ సమాధి చేసిందని, భూమి కోసం.. భుక్తి కోసం ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని విమర్శించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపలేదని, కాంగ్రెస్ పార్టీ బాటలోనే ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా నడుస్తోందని విమ‌ర్శించారు. విమోచన దినోత్సవాలు జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.