Begin typing your search above and press return to search.

ఇది ఏదో అనుకోవద్దు... అమీర్ పేట్ మెట్రోస్టేషన్!

హైదరాబాద్ లో ఐటీ కార్యాలయాలు పూర్తిగా వర్క్ చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యిందని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   10 July 2024 5:49 AM GMT
ఇది ఏదో అనుకోవద్దు... అమీర్ పేట్ మెట్రోస్టేషన్!
X

హైదరాబాద్ లో ఐటీ కార్యాలయాలు పూర్తిగా వర్క్ చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యిందని చెబుతున్నారు. ఇదే క్రమంలో కొత్త కొత్త కంపెనీలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా ప్రతీ ఏటా లక్షల మంది కొత్తవారు హైదరాబాద్ వెళ్లే బస్సులు, ట్రైన్లు ఎక్కుతున్నారని గణాంకాలు చెబుతున్నాయనే మాట ఎలానూ ఉంది. దీంతో నగరం రోజు రోజుకీ విస్తరిస్తుంది!

ఈ సమయంలో పెరుగుతున్న జనాలు, ఫలితంగా ట్రాన్స్ పోర్టేషన్ రద్దీ అనేది భారీ సమస్యగా మారుతుంది. బస్సు సౌకర్యాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో... మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వారు పూర్తిగా వాడుకుంటున్నారని అంటున్నారు. దీంతో... మెజారిటీ పురుష ప్రయాణికులతో పాటు, ఐటీ ప్రజలంతా అధికంగా మెట్రో రైలు పైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్ లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పే ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును... ఇక్కడ మీరు చూసిన ఫోటో హైదరాబాద్ లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో తీసింది. అది కూడా ఒక సాధారణమైన మంగళవారం (జూలై 9) న తీసింది. వీకెండ్ రోజో, సెలవు రోజో మాత్రం కాదన్నమాట! ఆ రోజు కూడా అమీర్ పెట్ మెట్రో స్టేషన్ లో రద్దీ ఈ స్థాయిలో ఉంది.

ఇలా అధిక సంఖ్యలో వస్తోన్న ప్రయాణికులను సమర్ధవంతంగా నిర్వహించడంలో స్టేషన్ ఫెయిలవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ప్రతీ గంటకూ వేలాది మంది ప్రయాణికులు అధిక సంఖ్యలో గుంపులు గుంపులుగా పోరాటాలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో రెండు కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా ఈ స్థాయిలో అదనపు రద్దీ వచ్చినప్పుడు మెరుగైన సేవలు, అదనపు కోచ్ ల ఆలోచనలు ఎందుకు చేయడం లేదనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కారణం... ఈ రద్దీ ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుండటమే.

ఈ ఫోటో అమీర్ పేట్ మెట్రో పరిస్థితికి అద్దంపడుతున్నప్పటికీ.. మిగిలిన స్టేషన్ లో ప్రయాణికుల గణాంకాలు అక్కడ పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయనుకోవచ్చు. ఇందులో భాగంగా... రాయదుర్గ్ స్టేషన్ లో ప్రతీ రోజూ సుమారు 75,000 మంది ప్రయాణికులు, అమీర్ పేట్ 65,000.. ఎల్బీ నగర్ 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు!

ఇదే సమయంలో... సెక్యూరిటీ చెక్ పాయింట్లు, ఛార్జీల గేట్లు వంటి సరిపోని సౌకర్యాలపైనా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మహిళా ప్రయాణికులకు ఈ పరిస్థితి సవాలుగా మారిందని అంటున్నారు. ఇలా ఇన్నేసి సమస్యలు, సవాళ్లూ ఉన్నప్పటీకీ హైదరాబాద్ మెట్రోలో రోజూ సుమారు 6.22 లక్షల రైడర్ షిప్ ఉండటం గమనార్హం.

మరి ఈ స్థాయిలో లక్షలాది మందికి ప్రతీ రోజూ అవసరమైన ఈ సేవలను విస్తరించే ఆలోచనలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇందులో భాగంగా అదనపు కోచ్ లు, రైళ్ల ప్రీక్వెన్సీ మొదలైన విషయాలను గుర్తు చేస్తున్నారు. మరి లక్షలాదిమంది ప్రయాణికుల ఈ డిమాండ్ ను హైదరాబాద్ మెట్రో ఏమేరకు పరిగణలోకి తీసుకుంటుందనేది వేచి చూడాలి.