వివాదాస్పద ట్వీట్: అంబటి రాయుడిపై భారీ ట్రోలింగ్
'ఆపరేషన్ సిందూర్ 2.0' పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 9 May 2025 10:55 AM ISTజమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులు, ఆ తరువాత భారత బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్ 2.0' పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. "కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుంది" అంటూ ఆయన చేసిన ట్వీట్ పట్ల నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దేశం ఉగ్రవాదంతో పోరాడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడులకు దీటుగా భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్ 2.0' పేరుతో ప్రతీకారం తీర్చుకుంటున్న నేపథ్యంలో అంబటి రాయుడు తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ మహాత్మా గాంధీ కొటేషన్ను పంచుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల్లో శాంతి ఆవశ్యకతను నొక్కి చెప్పడం ఆయన ఉద్దేశ్యమైనప్పటికీ, భారత సైన్యంపై ప్రశంసలు కురిపించాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ముందు దాడి చేశారో తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోతే వారు మనల్ని వదలరని, భారత దళాలు కేవలం తమను తాము రక్షించుకుంటున్నాయని, పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయని గుర్తు చేశారు. కొందరు నెటిజన్లు అయితే రాయుడును "పాకిస్తాన్ సానుభూతిపరుడు" అని, "దేశద్రోహి" అని కూడా దూషించారు. సైన్యానికి మద్దతుగా నిలవాల్సిన సమయంలో శాంతి గురించి మాట్లాడటం తగదని చురకలంటించారు.
నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్రమత్తమైన రాయుడు డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగారు. తన మొదటి ట్వీట్ను తొలగించకుండానే, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో మరో రెండు ట్వీట్లు చేశారు. మొదటి దానిలో, జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలు నెలకొనాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బలం, భద్రత, త్వరిత పరిష్కారం లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంటూ "జై హింద్" అని ముగించారు.
రెండో ట్వీట్లో భారత సైన్యాన్ని కొనియాడారు. "ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనం భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా నిలబడాలి. అసమాన ధైర్యం, క్రమశిక్షణ, నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న మన భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు. మీ త్యాగాలు ఎన్నటికీ మరువబడవు. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తుంది. మీ వీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం మమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచాలి. మీ సేవ మరింత శాంతియుత భవిష్యత్తుకు మార్గం సుగమం చేయాలి. జై హింద్" అని రాసుకొచ్చారు.
అయితే, రాయుడు ఈ వివరణాత్మక ట్వీట్లు చేసినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు. ఆయన తొలి ట్వీట్ను పట్టుకుని విమర్శలు కొనసాగించారు. కొందరు ఆయన వ్యాఖ్యలను ఐపీఎల్, రాజకీయాలతో ముడిపెట్టి ట్రోల్ చేశారు. మొత్తం మీద, దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయనను మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి, క్రికెట్ అభిమానులకు, నెటిజన్లకు చర్చనీయాంశంగా మారాయి. ఈ సంఘటన ఐపీఎల్ భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో చోటుచేసుకోవడం గమనార్హం. కొందరు అయితే రాయుడిని వెంటనే జనసేన పార్టీ నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.