అమరావతి.. ఆ ఒక్కటి అయితే తొలి దశ రయ్.. రయ్!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 25 May 2026 5:00 PM ISTఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు దశలుగా రాజధానిని విడదీసింది. తొలి-మలి దశలకు సంబంధించి.. పెద్ద ఎత్తున ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంది. దీనిలో తొలిదశ కీలకంగా మారింది. ప్రధాన రాజధాని ప్రాంతాలన్నీ(నవ నగరాలు) తొలి దశలోనే పూర్తి కానున్నాయి. దీనికి సంబంధిం చి రైతుల నుంచి 33 వేల ఎకరాలకు పైగా భూములను సమీకరించారు. ఇక, రెండో దశలో 44 వేల ఎకరాలను తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో అంతర్జాతీయ విమానాశ్రయం సహా.. 5 వేల ఎకరాలను రాజధానిఆర్థిక అవసరాల నిమిత్తం విక్రయించ నున్నారు.
అయితే.. తొలిదశకు కొన్ని చిక్కులు ఉన్నాయి. గతంలో చేపట్టిన భూ సమీకరణను కొందరు వ్యతిరేకించారు. వైసీపీ చెప్పిన మాటలు కావొచ్చు.. లేదా స్థానికంగా ఉన్న పరిస్థితులు కావొచ్చు. ఏదేమైనా.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాజధానిలో అక్కడక్కడ.. కొన్ని భూములను రైతులు సర్కారుకు ఇవ్వలేదు. ఇటు సమీకరణకు..అటు సేకరణకు కూడా సహకరించలేదు. ఇలా.. మొత్తం 700 పైచిలుకు ఎకరాల భూములు ప్రస్తుత నిర్మాణాల మధ్యలో ఖాళీగా ఉన్నాయి. వాటిని ఇస్తే తప్ప.. రహదారులు.. ఇతర నిర్మాణాలు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఇవి అయితే తప్ప.. తొలిదశ రాజధాని నిర్మాణం పట్టాలెక్కే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 700 ఎకరాలకు సంబంధించిన రైతులతో గత ఆరు మాసాలుగా చర్చలు జరుపుతోంది. అయితే.. కొందరు మాత్రమే సహకరించారు. మిగిలిన వారు తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నా రు. ఈ క్రమంలో సదరు భూములను 2013 నాటి.. భూ సేకరణ చట్టం కింద తీసుకునేందుకు సర్కారు రెడీ అయింది. దీని ప్రకారం.. రైతులకు ఆయా భూముల విలువ కట్టి సొమ్ములు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది సర్కారు ఆర్థిక భారంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పదే పదే బుజ్జగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయినప్పటికీ రైతులు 30 ఎకరాలకు సంబంధించి మాత్రమే సమీకరణకు ముందుకు వచ్చారు. దీంతో తాజాగా 700 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం.. ఆయా రైతులకు మూడిం తల సొమ్మును ముట్టజెప్పాలి. ఇది పూర్తయితే.. అమరావతి తొలిదశ నిర్మాణానికి దాదాపు అడ్డంకులు తప్పే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తద్వారా రాజధాని నిర్మాణం పరుగులు పెడుతుందని.. వచ్చే 2028 చివరి నాటికి తొలి దశ దాదాపు పూర్తవుతుందని చెబుతున్నారు.
