Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో పోటీపై అలీ సంచలన వ్యాఖ్యలు!

కాగా గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ క్రమంలో అలీ తన సొంత ఊరైన రాజమండ్రి నుంచి టికెట్‌ ఆశించారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 9:47 AM GMT
వచ్చే ఎన్నికల్లో పోటీపై అలీ సంచలన వ్యాఖ్యలు!
X

ఆంధప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఈ నేపథ్యంలో పలు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం ఆయన అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పలువురిని ఇప్పటికే మార్చారు. మార్చిన స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఏడు జాబితాలను విడుదల చేశారు.

ఈ క్రమంలో ప్రముఖ హాస్య నటుడు అలీని కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలుపుతున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అలీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ ఫలానా చోటు నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

ఈ వారంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనకు పిలుపు రావచ్చని అలీ తెలిపారు. రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. పోటీ చేసే వ్యక్తి మంచివారయితే ప్రజలు గెలిపిస్తారన్నారు. టీడీపీ, జనసేన పొత్తుపై మాట్లాడుతూ ఎంతమంది పొత్తులతో వచ్చినా అంతిమ విజయాన్ని నిర్దేశించేది ఓటర్లేనని స్పష్టం చేశారు.

కాగా అలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటరీ స్థానాల నుంచి బరిలోకి దింపొచ్చని అంటున్నారు. ఈ రెండింటిలో ఒక చోట నుంచి అలీ పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాలని అలీకి సూచించినట్టు పేర్కొంటున్నారు.

కాగా గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ క్రమంలో అలీ తన సొంత ఊరైన రాజమండ్రి నుంచి టికెట్‌ ఆశించారు. అక్కడి నుంచి కాకపోయినా ముస్లింలు ఎక్కువగా ఉన్న గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు.

అయితే అలీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అలీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. మూడున్నరేళ్లు ఖాళీగానే ఉండిపోయారు. ఇక 2021 చివరలో ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమించారు. అలీ కూడా ఆ పదవిలో సర్దుకుపోయారు.

కాగా అలీ ప్రస్తుతం వైసీపీ తరఫున సామాజిక సాధికార బస్సు యాత్రల్లో పాల్గొంటున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీని కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటరీ స్థానం నుంచి జగన్‌ బరిలోకి దింపడానికి నిర్ణయించారని అంటున్నారు.

గత ఎన్నికల్లో సీటు ఇవ్వనప్పటికీ, మంచి గుర్తింపు పొందిన పదవి ఇవ్వనప్పటికీ అలీ పార్టీ పట్ల విధేయతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఈసారి అలీకి న్యాయం చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలీని ఈసారి ఎంపీగా బరిలోకి దింపడం ఖాయం అంటున్నారు.