Begin typing your search above and press return to search.

అలీ పోటీ అక్కడి నుంచే.. సీటు ఖరారు!

కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవాలని అలీకి జగన్‌ ఆఫర్‌ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలీ నంద్యాలను ఎంచుకున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 March 2024 8:31 AM GMT
అలీ పోటీ అక్కడి నుంచే.. సీటు ఖరారు!
X

ఆంధప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఈ నేపథ్యంలో పలు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం ఆయన అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పలువురిని ఇప్పటికే మార్చారు. మార్చిన స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 9 జాబితాలను విడుదల చేశారు.

ఈ క్రమంలో ప్రముఖ హాస్య నటుడు అలీని కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలుపుతున్నారని టాక్‌ నడుస్తోంది. అలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దింపొచ్చని అంటున్నారు. ఈ మేరకు అలీకి జగన్‌ సీటు ఖరారు చేశారని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని అంటున్నారు. కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవాలని అలీకి జగన్‌ ఆఫర్‌ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలీ నంద్యాలను ఎంచుకున్నారని తెలుస్తోంది.

కాగా గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ క్రమంలో అలీ తన సొంత ఊరైన రాజమండ్రి నుంచి టికెట్‌ ఆశించారు. అక్కడి నుంచి కాకపోయినా ముస్లింలు ఎక్కువగా ఉన్న గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు.

అయితే అలీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అలీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. మూడున్నరేళ్లు ఖాళీగానే ఉండిపోయారు. ఇక 2021 చివరలో ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమించారు. అలీ కూడా ఆ పదవిలో సర్దుకుపోయారు.

కాగా అలీ ఇటీవల వరకు వైసీపీ తరఫున సామాజిక సాధికార బస్సు యాత్రల్లో పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీని కర్నూలు పార్లమెంటరీ స్థానం నుంచి జగన్‌ బరిలోకి దింపడానికి నిర్ణయించారని అంటున్నారు.

గత ఎన్నికల్లో సీటు ఇవ్వనప్పటికీ, మంచి గుర్తింపు పొందిన పదవి ఇవ్వనప్పటికీ అలీ పార్టీ పట్ల విధేయతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఈసారి అలీకి న్యాయం చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలీని ఈసారి ఎంపీగా బరిలోకి దింపడం ఖాయం అంటున్నారు.

అలాగే విజయనగరం నుంచి ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమర్‌ నాథ్, అమలాపురం నుంచి ఎమ్మెల్యే ఎలీజా ఎంపీలుగా పోటీ చేస్తారని సమాచారం. ఈ మేరకు వీరిని వైసీపీ ఖరారు చేసిందని అంటున్నారు.