జగన్కు షాకిచ్చిన సాయిరెడ్డి 'కుమార్తె'!
జగన్ చేసిన కామెంట్లపై ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టు పెట్టారు. దీనిలో జగన్ను ఉద్దేశించి.. పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 23 May 2025 6:19 AMవైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు.. వి. విజయసాయిరెడ్డిని ఉద్దేశించి.. ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు అమ్ముడు పోయారని.. అందు కే రాజ్యసభసీటును అమ్మేశారని.. ఇప్పుడు వైసీపీలో ఉంటే.. పార్టీ కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని.. చంద్రబాబును విమర్శించాల్సి వస్తుందని.. అందుకే.. రెండు విధాలా తనకు మేలు కలిగేలా టికెట్ అమ్ముకున్నారంటూ.. సాయిరెడ్డిపై విమర్శలు చేశారు.
అయితే.. జగన్ చేసిన ఈవిమర్శలపై సాయిరెడ్డి ఇంకా స్పందించకపోయినా.. ఆమె షడ్రకుడి(తోడల్లుడు) కుమార్తె, సాయిరెడ్డికి వరసకు కుమార్తె అయ్యే నందమూరి వారి ఇంటి కోడలు, నందమూరి అలేఖ్య ఘాటు గా స్పందించారు. జగన్ చేసిన కామెంట్లపై ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టు పెట్టారు. దీనిలో జగన్ను ఉద్దేశించి.. పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదేసమయంలో సాయిరెడ్డి మౌనాన్నిఆమె సమర్థించారు.
అలేఖ్య కామెంట్లు- అంతరార్థాలు!
+ 'ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు.'' అని వ్యాఖ్యానించడం ద్వారా.. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన విషయాన్నిఅలేఖ్య పరోక్షంగా ప్రస్తావించారు.
+ 'కొన్ని తప్పుడు ప్రచారాలు, కథనాలు ఉన్నప్పటికీ.. అర్హత లేని వారి పట్ల గౌరవం కారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు.''- సాయిరెడ్డి విషయంపై ఎందుకు స్పందిస్తారంటూ.. జగన్ను ఆమె నిలదీసినట్టు అయింది.
+ ''నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి''- వైసీపీ అధినేత తరచుగా చెప్పే ఈ మాటలను అలేఖ్య ప్రస్తావించి.. వాటిపై పేటెంట్ మీకు మాత్రమే లేదన్నట్టుగా పరోక్షంగా చురకలు అంటించారు.
+ ''మీరు కూడా మాట్లాడటం ఎంచుకుంటే ఏమవుతుందో అని నేను తరచుగా ఆలోచిస్తుంటాను''- అని బాబాయి సాయిరెడ్డి మౌనం వీడాలన్న సంకేతాలు ఇచ్చారు అలేఖ్య.
+ ''ఎన్నో ఊహగానాలు, ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఇది నిజం'' అని పేర్కొనడం ద్వారా.. సాయిరెడ్డిని ప్రజల మధ్యకు రావాలన్నట్టుగా అలేఖ్య సూచించారు. మొత్తంగా జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అలేఖ్య ఇలా ప్రతి స్పందించడం.. రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఆమె నందమూరి తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తారక రత్న 2023లో మృతి చెందారు.