అక్కను దూరంగా పెట్టేశాం : అలేఖ్య చిట్టీ సోదరి వీడియో వైరల్
తాజాగా మరో సోదరి రమ్య ఒక వీడియోను విడుదల చేస్తూ.. తమ భవిష్యత్తు ప్రణాళికపై నెటిజన్లకు స్పష్టత ఇచ్చింది.
By: Tupaki Desk | 19 April 2025 4:02 AM11 నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం సాధారణమైన విషయం కాదు. ఎలాంటి నేపథ్యం లేకుండా ముగ్గురు అమ్మాయిలు సాధించిన విజయం.. ఒకే ఒక్క చిన్న పొరపాటుతో ఒక్కసారిగా ఆ పచ్చళ్ల వ్యాపారం కుప్పకూలిపోయింది. గత కొద్ది రోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' పేరు ప్రతిచోటా వినిపిస్తోంది. ఒక వినియోగదారుడు ధరల గురించి మర్యాదగా ప్రశ్నిస్తే, అలేఖ్య అనుచితంగా మాట్లాడిన ఆడియో సందేశం సృష్టించిన దుమారం ఇది. ఈ సంఘటన తర్వాత ముగ్గురు అక్కాచెల్లెళ్లు క్షమాపణలు చెప్పినా, వినియోగదారులు శాంతించలేదు. నిరంతరంగా ట్రోల్స్ , విమర్శలు రావడంతో అలేఖ్య ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం ఒక వీడియో ద్వారా అలేఖ్య మరో సోదరి సుమీ ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. ఇకపై ఈ వివాదాలకు ముగింపు పలుకుతున్నామని, తాము కూడా బ్రతకాలని, తన పనులు తాను చేసుకుంటానని, మునుపటిలా వీడియోలు చేస్తానని తెలిపింది. తాజాగా మరో సోదరి రమ్య ఒక వీడియోను విడుదల చేస్తూ.. తమ భవిష్యత్తు ప్రణాళికపై నెటిజన్లకు స్పష్టత ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ "అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని కేవలం 11 నెలల్లోనే మూసివేయాల్సి వస్తుందని ఊహించలేదు. అవును ఇకపై అలేఖ్య చిట్టి పికిల్స్ ఉండదు. కానీ మేము త్వరలోనే 'రమ్య మోక్ష పికిల్స్' పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తాము. ఈ వ్యాపారంలో మా అక్క అలేఖ్య ఉండదు. నేను- నా చెల్లి మాత్రమే ఉంటాము. గతంలో ఉన్న అధిక ధరలు కాకుండా, సామాన్యులు కూడా కొనుగోలు చేయగలిగే ధరలతో మీ ముందుకు వస్తాము." అని తెలిపింది.
"కొంచెం సమయం పడుతుంది, కనీసం రెండు నెలలు పట్టవచ్చు. ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత మా వ్యాపారానికి పూర్వ వైభవం వస్తుందో లేదో మాకు తెలియదు. కానీ మమ్మల్ని ఇష్టపడేవారు చాలా మంది సోషల్ మీడియా ద్వారా మళ్లీ ప్రయత్నించమని సందేశాలు పంపుతున్నారు. కాబట్టి మేము మళ్లీ విజయం సాధించగలమని ఆశిస్తున్నాము. చాలా మంది మేము లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నామని అంటున్నారు. మాకు అన్ని రకాల లైసెన్సులు ఉన్నాయి. మా ఊరగాయలపై FSSAI ముద్ర , లైసెన్స్ నెంబర్ కూడా ఉంటాయి. మేము ప్రారంభించబోయే కొత్త వ్యాపారం కూడా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే మొదలు పెడతాము. అందుకే కాస్త సమయం పడుతుంది. అయితే ఈసారి వినియోగదారులతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించాలని అనుకుంటున్నాము" అని రమ్య వివరించింది.