ఈసారి అక్షయ తృతీయకు రూ.లక్ష షాక్?
మిగిలిన రోజులు ఎలా ఉన్నా అక్షయ తృతీయ రోజు ఒక గ్రాము బంగారం కొన్నా.. ఏడాది మొత్తంలో అంతో ఇంతో బంగారాన్ని కొనేలా చేస్తుందన్న సెంటిమెంట్ ఎక్కువ.
By: Tupaki Desk | 30 April 2025 11:30 AMమిగిలిన రోజులు ఎలా ఉన్నా అక్షయ తృతీయ రోజు ఒక గ్రాము బంగారం కొన్నా.. ఏడాది మొత్తంలో అంతో ఇంతో బంగారాన్ని కొనేలా చేస్తుందన్న సెంటిమెంట్ ఎక్కువ. అందుకే.. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. అక్షయ తృతీయ రోజున బంగారం ధర కాస్త ఎక్కువగా ఉన్నా సరే పసిడిని కొనేందుకు విపరీతమైన ఆసక్తిని చూపుతారు. కొందరైతే ఈ శుభదినాన కొనాల్సిన బంగారు ఆభరణాల కోసం నెలల ముందే ప్లాన్ చేస్తుంటారు. మరి.. ఈసారి ఈ అక్షయ తృతీయ ఎలా ఉంటుంది? అన్నది ప్రశ్నగా మారింది.
గత ఏడాది అక్షయ తృతీయ రోజున పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73,500 ఉంటే.. ఈసారి అది కాస్తా ఏకంగా రూ.99,800కు పెరిగింది. అంటే.. కాస్త చిల్లర్ని పక్కన పెడితే పది గ్రాముల బంగారం రూ.లక్ష చేరింది. ఇలాంటివేళ.. అమ్మకాలు ఎలా ఉంటాయి? అన్నది ప్రశ్నగా మారింది. సాధారణంగా అక్షయ తృతీయ రోజున కచ్ఛితంగా బంగారాన్ని కొనే వర్గం భారీగా ఉంటుంది. అయితే.. ఈసారి భారీగా పెరిగిన ధర ప్రభావం అమ్మకాల మీద ఖాయంగా ఉంటుందని చెబుతున్నారు.
గతంలో మాదిరి బంగారు దుకాణాల్లో హడావుడి కనిపించే అవకాశం ఉండదంటున్నారు. ఒకవేళ కొనుగోలుకు షాపులకు వచ్చినా.. గ్రాము.. రెండు గ్రాముల బంగారం కొనేందుకే ఆసక్తి చూపుతారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార వర్గాల అంచనా ప్రకారం దేశ వ్యాప్తంగా ఈ అక్షయ తృతీయకు రూ.16వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మంచిరోజున గతంలో బంగారం కొనే వారు.. ఈసారి అందుకు భిన్నంగా ఆస్తులు కానీ.. ఎలక్ట్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేసే వీలుందని చెబుతున్నారు. బంగారు పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ఈ రోజున 12 టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీల) బంగారం అమ్ముడయ్యే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.