విధి.. గుజరాత్ మాజీ సీఎంను ఎలా వక్రీకరించిందో తెలుసా?
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణానికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 14 Jun 2025 11:51 PM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ కూడా ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ రూపాణీకి సంబంధించి ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు తెరపైకి రాగా.. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణానికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... లండన్ లో ఉన్న తన భార్య, కుమార్తెను కలిసేందుకు వెళ్తున్న విజయ్ రూపాణీ.. జూన్ 12కు ముందు రెండుసార్లు వెళ్లేందుకు సిద్ధమై టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిసింది.
అయితే మూడోసారి మాత్రం బయలుదేరాలని పూర్తిగా ఫిక్సైన విజయ్ రూపాణీ... లండన్ చేరుకోకముందే ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పైగా అది ఆయన లక్కీ నెంబర్ గా భావించే 1206 సంఖ్యను కలిగిన (జూన్ 12) తేదీ కావడం గమనార్హం. ఈ నెంబర్ తోనే ఆయన ఫస్ట్ స్కూటర్ నుంచి లేటెస్ట్ గా కొన్న కారు నెంబర్ వరకూ ఉన్నాయని సమాచారం.
వాస్తవానికి విజయ్ రూపాణీ మే నెలలోనే తన భార్యతో కలిసి లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎయిరిండియా విమానంలో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల తన పర్యటనను రద్దు చేసుకుని.. తన భార్యను మాత్రం పంపించారు. అనంతరం జూన్ 5న మరోసారి టిక్కెట్ బుక్ చేసుకుని.. పలు వ్యక్తిగత కారణాలతో రద్దు చేసుకున్నారు.
ఇలా రెండుసార్లు లండన్ వెళ్లాలని భావించి టిక్కెట్స్ బుక్ చేసుకుని మరీ క్యాన్సిల్ చేసుకున్న విజయ్ రూపాణి.. జూన్ 12న మాత్రం తన ప్రయాణాన్ని కన్ఫాం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ రోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు.
