171 నెంబరుకు ఎయిరిండియా బైబ్
విమానయాన రంగంలో ఏదైనా విమానం ప్రమాదానికి గురైనప్పుడు.. దాని కారణంగా ప్రాణనష్టం చోటు చేసుకుంటే.. సదరు విమాన నెంబరును తొలగించే సంప్రదాయం ఉంది
By: Tupaki Desk | 15 Jun 2025 9:07 AMఅహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (ఐఎక్స్ 171) టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోవటం.. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు మినహా 270 మంది మరణించటం తెలిసిందే. ఏఐ171 నెంబరుతో బోయింగ్ 787-8 విమానం కూలిన నేపథ్యంలో.. ఇప్పుడా సర్వీసు నెంబరును ఎయిరిండియా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. విమానయాన రంగంలో ఏదైనా విమానం ప్రమాదానికి గురైనప్పుడు.. దాని కారణంగా ప్రాణనష్టం చోటు చేసుకుంటే.. సదరు విమాన నెంబరును తొలగించే సంప్రదాయం ఉంది.
తాజా దుర్ఘటన నేపథ్యంలో ఎయిరిండియా ఏఐ171, ఐఎక్స్ 171 పేర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి నడిచే విమానానికి సరికొత్త నెంబరును కేటాయించారు. 17వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానాన్ని ఏఐ159 నెంబరుతో వ్యవహరిస్తారు. ఈ మేరకు టికెట్ బుకింగ్ వ్యవస్థలోనూ మార్పులు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సైతం తన విమానానికి ఉన్న ఐఎక్స్ 171 నంబరును వదులుకుంటున్నట్లుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన కొత్త నంబరును ప్రకటించలేదు. ప్రమాదంలో మరణించిన వారికి నివాళిగా పాత నంబరును వదిలేసుకోవటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీగా చెప్పాలి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను ఎయిరిండియా ఫాలో అయ్యిందని చెప్పాలి.