విమాన ప్రమాదం.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య!
అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. భారతదేశ చరిత్రలోని ఘోర విమాన ప్రమాదాల్లో ఇది ఒకటని అంటున్నారు.
By: Tupaki Desk | 14 Jun 2025 12:51 PM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు 24 మంది స్థానిక పౌరులు మరణించినట్లు ఇప్పటికే ప్రకటించిన అధికారులు.. ఆ సంఖ్య పెరిగిందని తాజాగా తెలిపారు. ఇందులో భాగంగా... ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 274కు చేరినట్లు వెల్లడించారు.
అవును... అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. భారతదేశ చరిత్రలోని ఘోర విమాన ప్రమాదాల్లో ఇది ఒకటని అంటున్నారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 274కి చేరినట్లు తాజాగా అధికారులు ప్రకటించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మిగిలినవారు స్థానిక నివాస ప్రాంతంలోని ప్రజలు, మెడికోలు అని తెలిపారు.
కాగా... గురువారం మధ్యాహ్నం 1:39 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ ప్రాంతం వద్ద ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది ఇతర సిబ్బంది ఉండగా.. వీరిలో ఒక్క ప్రయాణికుడు మాత్రం గాయాలతో బయటపడ్డారు. మిగిలిన 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు తాజాగా మరో 33 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో.. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 274కు చేరింది.
