Begin typing your search above and press return to search.

ఏఐ తీసుకొచ్చి వారి ఉద్యోగాలను వాళ్లే పోగొట్టుకున్నారు.. మైక్రోసాఫ్ట్‌‎లో 6 వేల మందికి ఉద్వాసన

కొన్ని నెలల క్రితం, సంస్థ యాజమాన్యం వీరికి ఏఐ సాధనాల వినియోగాన్ని పెంచాలని, వాటిపై ఆధారపడాలని సూచించినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   24 May 2025 1:00 AM IST
ఏఐ తీసుకొచ్చి వారి ఉద్యోగాలను వాళ్లే పోగొట్టుకున్నారు.. మైక్రోసాఫ్ట్‌‎లో  6 వేల మందికి ఉద్వాసన
X

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence - AI) టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుందని, మానవ జీవితాన్ని సులభతరం చేస్తుందని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే, అదే ఏఐ ఇప్పుడు ఉద్యోగాలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)లో తాజాగా జరిగిన ఉద్యోగుల తొలగింపులు ఈ వాస్తవాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్న సామెత చందంగా కంపెనీ కోసం ఏఐ సిస్టమ్స్ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇప్పుడు తమ ఉద్యోగాలను కోల్పోవడం ఆశ్చర్యకరంగా ఉంది.

మైక్రోసాఫ్ట్ ఇటీవల తన ప్రపంచవ్యాప్త సిబ్బందిలో సుమారు మూడు శాతం మందికి ఉద్వాసన పలికింది. దీనివల్ల దాదాపు 6,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచాలనే వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్‌లు జరిగాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అయితే, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ తొలగింపులలో ఏఐ వ్యవస్థలను రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.

వాషింగ్టన్‌లోని మైక్రోసాఫ్ట్ ఆఫీసులో తొలగించిన ఉద్యోగులలో 40 శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ఉన్నారు. కొన్ని నెలల క్రితం, సంస్థ యాజమాన్యం వీరికి ఏఐ సాధనాల వినియోగాన్ని పెంచాలని, వాటిపై ఆధారపడాలని సూచించినట్లు సమాచారం. ఆ సూచనల మేరకు వారు ఎంతో కృషి చేసి, పలు ఏఐ వ్యవస్థలను రూపొందించారు. కానీ, విచిత్రంగా ఇప్పుడు అదే ఏఐ వ్యవస్థలు వారి ఉద్యోగాలను భర్తీ చేయడం గమనార్హం.

తమ ఉద్యోగాలకే వారే ఎసరు పెట్టుకున్నారా?

మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి జెఫ్ హల్స్ కొన్ని వారాల క్రితం తన ఆధ్వర్యంలో ఉన్న 400 మంది ఉద్యోగులకు 50 శాతం కోడ్‌ను ఓపెన్ ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించి రాయాలని సూచించారు. తాజా తొలగింపులలో ఆ బృందం కూడా ఉంది. అంటే, వారికి తెలియకుండానే వారి ఉద్యోగాలకు వారే ఎసరు తెచ్చుకున్నట్లైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

జూనియర్ కోడర్లు, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగాలలో ఉన్నవారు. అలాగే ఏఐ ప్రాజెక్టులలో పనిచేస్తున్న సిబ్బంది ఈ కొత్త లేఆఫ్‌లను ఎదుర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ స్టార్టప్‌లకు చెందిన ఏఐ డైరెక్టర్ గాబ్రియేలా డికీరోజ్ కూడా తన పదవిని కోల్పోవడం ఈ పరిణామం తీవ్రతను తెలియజేస్తుంది. ఈ తొలగింపులపై ఆమె స్పందిస్తూ.. సంస్థ కోసం ఎంతో కృషి చేసిన వారు తమ ఉద్యోగాలను కోల్పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.

ఈ తొలగింపులు 2023లో మైక్రోసాఫ్ట్ 10,000 మందికి ఉద్వాసన పలికిన తర్వాత, రెండవ అతిపెద్ద తొలగింపు. "మార్కెట్‌లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటాం" అని ఈ లేఆఫ్‌లపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందించారు. మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని చెప్పారు.

గత నెల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఏఐ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ కంపెనీకి సంబంధించి 30 శాతం కోడింగ్‌ను కృత్రిమ మేధ సాయంతోనే రాస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడడం పెరుగుతోందని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది వారాలకే 3 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన రావడం గమనార్హం. ఈ పరిణామాలు ఏఐ అభివృద్ధి ఉద్యోగ అవకాశాలపై ఎలా ప్రభావం చూపుతుందో, భవిష్యత్తులో టెక్ పరిశ్రమ ఎలా రూపాంతరం చెందుతుందో అన్న చర్చను మరోసారి లేవనెత్తాయి.