'విమానం ముక్కలైంది.. నా సీటు ఎగిరి బయటపడింది'... మృత్యుంజయుడి అనుభవం!
ఈ సందర్భంగా హాస్పటల్ బెడ్ పై ఉన్న కుమార్.. తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
By: Tupaki Desk | 13 Jun 2025 7:17 AMఅహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మృత్యుంజయుడుగా అభివర్ణించబడుతోన్న విశ్వస్ కుమార్ రమేష్.. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఘొర ప్రమాదం నుంచి ఎలా బయటపడింది తన మాటలతోనే స్పష్టం చేశాడు.
అవును... అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారిలో ఒకే ఒక్కరు సజీవంగా బయటపడ్డారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విమానంలో ఎమర్జెన్సీ డోర్ వద్ద ఉన్న 11ఏ సీటులో కూర్చున్న రమేష్.. గాయాలతో బయటపడ్డారు.
ఈ సందర్భంగా హాస్పటల్ బెడ్ పై ఉన్న కుమార్.. తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇందులో భాగంగా.. విమానం రన్ వే మీద నుంచి వేగం పుంజుకోవడం ప్రారంభించిన వెంటనే తనకు ఏదో వింతగా అనిపించిందని చెప్పాడు. అనంతరం విమానంలో ఒక్కసారిగా నిశబ్ద్ధం.. అకస్మాత్తుగా ఆకుపచ్చ, తెలుపు లైట్లు వెలిగాయని తెలిపారు.
విమానం టేకాఫ్ కోసం పైలెట్స్ తన వంతు కృషి చేసినట్లు అనిపించిందని.. ఆపై విమానం నేరుగా హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లిందని వెల్లడించారు. ఆ సమయలో తాను ప్రాణాలతో ఎలా బయటపడ్డానో తెలియదని కుమార్ తెలిపారు. తాను చనిపోతానని అనుకున్నానని, కళ్లు తెరిచి చూస్తే బ్రతికే ఉన్నానని అన్నారు.
తన సీటు బెల్ట్ ఊడిపోయి, ఎగిరి బయట పడ్డానని.. ఆ సమయంలో తన పక్కన ఎయిర్ హోస్టెస్, అంకుల్, ఆంటీ అంతా చనిపోయి ఉన్నారని తెలిపారు. విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఊడిపోయి ఉండొచ్చని.. దాని నుంచి తాను ఎగిరి బయట పడ్డానని వెల్లడించారు! ఆ సమయంలో కొన్ని క్షణాల్లో చెలరేగిన మంటలు తన చేతిని కాల్చాయని తెలిపారు!
అంతకముందు.. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ లోని డాక్టర్లతో మాట్లాడిన రమేష్.. విమానం రెండు ముక్కలైంది.. నా సీటు ఎగిరి బయట పడింది అని చెప్పాడని తెలుస్తోంది. తాను ప్రమాద సమయంలో విమానం నుంచి దూకలేదని.. విమానం ముక్కలైనప్పుడు తన సీటుతో సహా బయటకు విసిరివేయబడ్డానని వెల్లడించారు!