అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మరో విషయం తెరపైకి!
మరోవైపు.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కూడా రంగంలోకి దిగి విచారణ చేస్తోంది.
By: Tupaki Desk | 16 Jun 2025 10:06 AMగుజరాత్లోని ప్రముఖ పారిశ్రామిక పట్టణం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని , ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో 290 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలావుంటే.. అసలు ఈ ఘటన ఎలాజరిగింది? సాంకేతిక కారణమా ? లేక.. ఏదైనా లోపమా? అనే చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. దీనిపై ఉగ్రవాద నిరోధక చర్యలపై విచారణ జరిపే జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ ఐఏ) కూడా రంగంలోకి దిగింది.
మరోవైపు.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కూడా రంగంలోకి దిగి విచారణ చేస్తోంది. ఇంకో వైపు.. కేంద్ర ప్రభుత్వం ఏవియేషన్ నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది. అయితే.. రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు దీనికి కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.ఈ క్రమంలో తాజాగా .. మరో కోణం వెలుగు చూసింది. విమాన ప్రమాదం జరుగుతుందని ముందుగానే తెలుసునన్నది తాజాగా తెరమీదకి వచ్చిన విషయం.
విమాన ప్రమాదానికి సంబంధించి వైరల్ అవుతున్న రెండు వీడియోలను నిశితంగా పరిశీలించిన అమెరికాకు చెందిన ఏవియేషన్ విశ్లేషకుడు కెప్టెన్ స్టీవ్ సంచలన విషయాలు వెల్లడించారు. విమానం కూలే ముందు దాని కింది భాగంలో ఉన్న ర్యామ్ ఎయిర్ టర్బైన్ బయటకు వచ్చినట్లు తెలిపారు. ఇది రెండు వీడియోలోనూ స్పష్టంగా కనిపించిందన్నారు. ఇలా టర్బైన్ తెరుచుకోవడానికి కారణం.. ఇంజిన్లు విఫలం కావడమేనన్నారు. ఇంజన్లకు `పవర్` సరఫరా నిలిచినప్పుడు స్వయంగా టర్బైన్ తెరుచుకుంటుందని చెప్పారు.
ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టేందుకు అవకాశం ఉంటుందని.. విమానం స్టార్ట్ చేసినప్పుడే.. ఈ విషయం తెలుస్తుందన్నారు. కానీ, ఒక్కొక్కసారి పైలట్లు అతి విశ్వాసంతో ఉన్న సందర్భాల్లో మాత్రమే ఇలాంటి సూక్ష్మ లోపాలను పసిగట్టలేరన్నారు. ఇక, ఇవి తెరుచుకునే సమయానికి విమానం అప్పటికే 600 ఫీట్ల ఎత్తులో ఉందన్నారు. దీంతో టర్బైన్ ద్వారా లోపాన్ని గుర్తించినా.. విమానాన్ని అదుపు చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. అయితే.. పైలట్ సాధ్యమైనంత వరకు విమానాన్ని జాగ్రత్తగా కిందికి దింపే ప్రయత్నం అయితే చేశారని తెలిపారు.