'మనకు వారి తలలు కావాలి'... 'ఉరి' డైరెక్టర్ సంచలన పోస్ట్!
పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
By: Tupaki Desk | 24 April 2025 5:30 AMపహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రపంచ దేశాలు ఈ చర్యను ఖండించాయి. ఈ దాడితో భారతీయులు రగిలిపోతున్నారు. ఈ సందర్భంగా తమ తమ ఆగ్రహాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.. ఉగ్రచర్యను ఖండిస్తున్నారు. ఈ సమయంలో "ఉరి" డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
అవును... పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారతీయులు రగిలిపోతున్నారు.. ప్రతీకార చర్యను కోరుకుంటున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. "ఉరి - సర్జికల్ స్ట్రైక్" సినిమా రచయిత, దర్శకుడు ఆదిత్య ధర్ స్పందిస్తూ.. ఎక్స్, ఇన్ స్టా వేదికగా కీలక పోస్ట్ పెట్టారు.
ఆదిత్య ధర్ తన సోషల్ మీడియా పోస్ట్, స్టోరీలో... "వారికి కశ్మీర్ కావాలి.. మనకు వారి తలలు కావాలి" అని రాశారు. దీంతో.. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నెటిజన్లు.. ఆదిత్య ధర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదే సమయంలో... ఈ దాడిపై ఆదిత్య ధర్ భార్య, నటి యామీ గౌతమ్ స్పందించారు. పహల్గాం దాడిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తన పోస్ట్ లో రాశారు.
కాగా... 2019లో విడుదలైన "ఉరి - ది సర్జికల్ స్ట్రైక్" సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాడు కశ్మీర్ లో జరిగిన పుల్వామా దాడిలో భారత్ తీసుకున్న ప్రతీకారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాకిస్థాన్ పై భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ను అది చూపిస్తుంది. ఈ సమయంలో మరోసారి కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆదిత్య ధర్ స్పందిస్తూ... "వారికి కశ్మీర్ కావాలి.. మనకు వారి తలలు కావాలి" అని రాశారు. దీంతో... ఇదే దాదాపు ప్రతీ భారతీయుడి కోరిక అని, వారి మనసుల్లో మాటే ఆదిత్య రాశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా.. ఇప్పటికే పాక్ పై భారత్ దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.