Begin typing your search above and press return to search.

ఆ పార్టీలోకే ఈ తెలుగు హీరోయిన్‌!

ఈ నేపథ్యంలో ఇటీవల సుమలత.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ లతో భేటీ కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

By:  Tupaki Desk   |   5 April 2024 9:19 AM GMT
ఆ పార్టీలోకే ఈ తెలుగు హీరోయిన్‌!
X

కన్నడ రెబల్‌ స్టార్, దివంగత మాజీ మంత్రి అంబరీష్‌ సతీమణి, ప్రముఖ సినీ నటి సుమలత బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆ పార్టీలో చేరాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో సుమలత చేరనున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్యా ఎంపీగా సుమలత ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమె ఇండిపెండెంట్‌ గా పోటీ చేశారు. బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సుమలతకు మద్దతు ఇచ్చింది. సుమలతపై మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ పోటీ చేశారు. అయితే బీజేపీ మద్దతు ఇవ్వడంతో జేడీఎస్‌ తరఫున పోటీ చేసిన నిఖిల్‌ పై సుమలత సులువుగా విజయం సాధించారు.

కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్‌ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా జేడీఎస్‌ మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో సుమలత ప్రాతినిధ్యం వహిస్తున్న మాండ్యా కూడా ఉంది. ఇక్కడి నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా కుమారస్వామి పోటీ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల సుమలత.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ లతో భేటీ కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జనతాదళ్‌ (సెక్యులర్‌) కు మాండ్యా కంచుకోట. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో మాండ్యా నుంచి దేవగౌడ మనుమడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అయిన సినీ హీరో నిఖిల్‌ గౌడ బరిలోకి దిగారు. అయితే సుమలత చేతిలో ఓడిపోయారు. బీజేపీ పోటీ చేయకుండా సుమలతకు మద్దతు ఇవ్వడంతో ఆమె సునాయాసంగా విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో ఆమె మరోమారు మాండ్యా నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ పెద్దలను కలిశారని టాక్‌ నడుస్తోంది. అయితే గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన బీజేపీ, జేడీఎస్‌ ఈసారి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఈ క్రమంలో మాండ్యా సీటును పొత్తులో భాగంగా జేడీఎస్‌ కు వదిలేశారు.

ఈ నేపథ్యంలో సుమలత మరోసారి ఇండిపెండెంట్‌ గా బరిలోకి దిగినా గెలుపు కష్టమే అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్‌ ఎంపీగా ఉన్న సుమలత ఇప్పటిదాకా బీజేపీలో చేరలేదు. బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు.

మరోవైపు జేడీఎస్‌ కూడా ఒక మెట్టు దిగింది. సుమలత నివాసానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆమె ఆశీస్సులు కోరారు. తన విజయానికి కృషి చేయాలని విన్నవించారు. కుమారస్వామి వినతిపై తాను అభిమానులు, కార్యకర్తలతో ఆలోచించి చెబుతానన్న సుమలత ఎట్టకేలకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

వాస్తవానికి గతేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమలత బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఆ పార్టీలో చేరకుండా తన మద్దతును ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.