Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా పిచ్చి.. చంద్రమండలంపై స్థలం కొంటారా?

తాజాగా చంద్రుడిపై ఎకరం స్థలం కొని బహుమతిగా ఇచ్చాడంట.

By:  Tupaki Desk   |   8 Sep 2023 6:44 AM GMT
సోషల్  మీడియా పిచ్చి.. చంద్రమండలంపై స్థలం కొంటారా?
X

చంద్రయాన్-3 విజయవంతం అయిన తర్వాత జాబిల్లిపై మానవ నివాసాలు అనే టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత ఈతరహా ఆలోచనలు భారత్ లో కూడా ఎక్కువయ్యాయని అంటున్నారు. ఈ సమయంలో చంద్రుడిపై స్థలాలు కొనాలనే ఆలోచన సైతం భారతీయులు బలంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఒక వ్యక్తి తన భార్యకోసం జాబిల్లిపై స్థలం కొన్నాడు!

చంద్రుడుపై స్థలం కొన్నారని భార్యకు గిఫ్టు ఇచ్చారని, గర్ల్ ఫ్రెండ్ కు బహుమతి ఇచ్చారని.. తమ పిల్లలకు వారసత్వ ఆస్థిని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తూనే ఉంటుంటాయి. అయితే అవి ఎక్కువగా విదేశాల్లోనే జరుగుతుండేవి! అయితే చంద్రయాన్ - 3 తర్వాత అవి భారత్ లోనూ మొదలైపోయాయి అనే చెప్పే సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక వ్యక్తి, చంద్రుడిపై సుమారు ఎకరం స్థలం కొని భార్యకు పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

వివరాళ్లోకి వెల్తే... పశ్చిమ బెంగాల్ లోని ఝర్ గ్రామ్ జిల్లాకు చెందిన సంజయ్ మహతో.. అనుమిక అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత ఏప్రిల్ లోనే వీరి వివాహం జరిగింది. అయితే ప్రేమించుకునే రోజుల్లో చేసుకున్న వాగ్ధానాలో.. చెప్పుకున్న మాటలో తెలియదు కానీ... తాజాగా చంద్రుడిపై ఎకరం స్థలం కొని బహుమతిగా ఇచ్చాడంట.

వారి వివాహం జరిగిన తరువాత తన భార్యకు ఇది మొదటి పుట్టిన రోజు కావడంతో సంజయ్ ఈ స్థాయిలో ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇందులో భాగంగానే జాబిల్లిపై ఎకరం స్థలం కొనేసి పుట్టిన రోజు కానుకగా ఇచ్చేశాడు. చంద్రుడిపై సంజయ్ కొన్న ఎకరం స్థలం ఖరీదు రూ.10,000 కావడం గమనార్హం.

కాగా లూనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ చంద్రుడిపై స్థలాలు అమ్ముతున్న సంగతి తెలిసిందే. దీంతో సంజయ్ తన స్నేహితుడి సహాయంతో ఆ సంస్థ ద్వారా ఎకరం స్థలాన్ని రూ.10 వేలకు కొన్నాడు. అనంతరం దానికి సంబంధించిన సర్టిఫికెట్ ను భార్యకు కానుకగా ఇచ్చాడు. దీంతో భార్య కళ్లల్లో ఆనందం చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నట్లున్నాడు!