ఏసీలో మంటలు.. ఊపిరాడక చనిపోయిన కొరియోగ్రాఫర్
బుధవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు వీరేందర్ రెడ్డి ఏసీలో షాట్ సర్క్యూట్ కారణంగా గదిలో మంటలు.
By: Tupaki Desk | 8 May 2025 5:01 AMఅవును.. ఏసీ ఒక ప్రాణాన్ని తీసింది. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ షాకింగ్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గండిపేట మండలంలోని పుప్పాలగూడలోని ఒక అపార్ట్ మెంట లో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన 39 ఏళ్ల వీరేందర్ రెడ్డి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. అతడి తండ్రి ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. తల్లిదండ్రులతో పాటు ఉండే వీరేందర్ రెడ్డి మంగళవారం రాత్రి వేరే బెడ్రూంలో పడుకున్నాడు.
బుధవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు వీరేందర్ రెడ్డి ఏసీలో షాట్ సర్క్యూట్ కారణంగా గదిలో మంటలు.. పొగలు రావడాన్ని గమనించిన పక్క ప్లాట్ వారు డయల్ 100కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటల్ని ఆర్పేసి.. బెడ్రూంలో నుంచి వీరేందర్ రెడ్డిని బయటకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవటంతో సీపీఆర్ చేశారు. అయినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వీరేందర్ రెడ్డి మరణించినట్లుగా గుర్తించారు.
ఆరేళ్ల క్రితం వీరేందర్ రెడ్డికి వైజాగ్ కు చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే.. కొంతకాలంగా వారు విడిగా ఉంటున్నారు. ఈ మధ్యనే వారిద్దరూ రాజీ చేసుకొని మళ్లీ కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఇంతలోనే అనూహ్య ఘటన చోటు చేసుకోవటం.. ప్రాణం పోవటం షాకింగ్ గా మారింది. ప్రమాదవశాత్తు ఏసీలో చోటు చేసుకున్న షాట్ సర్క్యూట్ తో ప్రాణం పోవటంపై అపార్టు మెంట్ వాసులు దిగ్భాంత్రికి గురవుతున్న పరిస్థితి.