Begin typing your search above and press return to search.

హస్తినలో కొత్త పార్టీ... ఆప్ కు ఫుల్ బ్యాడ్ టైం నడుస్తోందా?

గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాడ్ టైమ్ నడుస్తోన్నట్లుందనే చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 May 2025 6:30 PM
హస్తినలో కొత్త పార్టీ...  ఆప్  కు ఫుల్  బ్యాడ్  టైం నడుస్తోందా?
X

గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాడ్ టైమ్ నడుస్తోన్నట్లుందనే చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా... ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనంతరం పార్టీలో కీలకమైన నేతలు జైలుకు వెళ్లడం.. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం వంటివి ఆ పార్టీని అన్ని విధాలా దెబ్బతీసిందని అంటున్నారు. ఈ సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది.

అవును... హస్తినలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ప్రకటించారు. అంటే.. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుండగా.. దాని నాయకుడు ముఖేష్ గోయల్.

వాస్తవానికి గత నెలలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో కీలక పరిణామం నెలకొంది. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ రాజా ఇక్బాల్ సింగ్ 133 ఓట్లతో కొత్త మేయర్ అయ్యారు! ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి మన్ దీప్ కు కేవలం 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే... ఈ ఎన్నికలను ఆప్ బహిష్కరించడంతో.. ఆ పార్టీ నాయకుల్లో ఆగ్రహం రేకెత్తించిందని అంటున్నారు.

దీంతో.. ఆప్ లోని సీనియర్ నాయకుడు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ సభా నాయకుడు ముఖేష్ గోయల్ నాయకత్వంలో పార్టీలో చీలిక ఏర్పడింది. ఈ సందర్భంగా స్పందించిన ముఖేష్ గోయల్.. తాను, తనకు సపోర్ట్ చేసే కౌన్సిలర్లు వేరే మార్గాన్ని నిర్ణయించుకున్నామని.. ఈ కొత్త పార్టీ పేరు "ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ" అని తెలిపారు.

ఆయన లెక్కల ప్రకారం... ఈ కొత్త పార్టీలో 15 మంది కౌన్సిలర్లు చేరనున్నారు. ఈ ఘటన ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద రాజకీయ సవాలుగా పరిగణించబడుతోందని అంటున్నారు. వాస్తవానికి ముఖేష్ గోయల్ సహా చాలా మంది నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి.. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆప్ లో చేరారు.

అయితే... దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అధికారిక స్పందన రాలేదు కానీ... ఈ తిరుగుబాటు గురించి పార్టీ నాయకత్వం చాలా ఆందోళన చెందుతోందని అంటున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఈ కొత్త మలుపు ప్రధానంగా ఆప్ భవిష్యత్తు రాజకీయాలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.