Begin typing your search above and press return to search.

2023లో ప్రధాని మోడీ పర్యటించిన దేశాలు ఇవే?

2023లో ఎన్ని దేశాలు పర్యటించారు, ఏయే దేశాల్లో పర్యటించారు అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైంది. ఈ సందర్భంగా ఒక లిస్ట్ తెరపైకి వచ్చింది!

By:  Tupaki Desk   |   27 Dec 2023 8:08 AM GMT
2023లో ప్రధాని మోడీ పర్యటించిన దేశాలు ఇవే?
X

అటు సోషల్ మీడియాలోనూ, ఇటు విదేశీ పర్యటనలోనూ మోడీ ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటారని అంటుంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలోని ఫాలోవర్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించిన మోడీ.. 2023లో ఎన్ని దేశాలు పర్యటించారు, ఏయే దేశాల్లో పర్యటించారు అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైంది. ఈ సందర్భంగా ఒక లిస్ట్ తెరపైకి వచ్చింది!

అవును... ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తుంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాదిలో ప్రధాని మోడీ.. జపాన్, పాపువా న్యూ గినియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా, దుబాయ్ తదితర దేశాలలో పర్యటించారని తెలుస్తుంది! ఈ సమయంలో ఏయే దేశానికి ఎప్పుడు వెళ్లారనేది ఇప్పుడు చూద్దాం...!

జపాన్‌ - ఆస్ట్రేలియా:

ఈ ఏడాది మే నెలలో జపాన్ లోని హిరోషిమాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొన్నారు. అనంతరం... పాపువా న్యూ గినియాను సందర్శించి అక్కడ జరిగిన ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు.

అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆస్ట్రేలియా వెళ్లారు. ఈ సందర్భంగా సిడ్నీని సందర్శించిన ఆయన... స్థానిక భారతీయ కమ్యూనిటీతో సంభాషించారు.

అమెరికా:

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ ఏడాది జూన్ 20న న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోడి... ఆ మరుసటి రోజు జూన్ 21న జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సారధ్యం వహించారు. ఈ వేడుక ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగింది.

ఈజిప్టు:

అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సీసీ ఆహ్వానం మేరకు జూన్ 22న ప్రధాని మోడీ ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడుంటున్న భారతీయులతో సంభాషించారు.

ఫ్రాన్స్‌:

ఈ ఏడాది జూలై రెండో వారంలో భారత ప్రధాని మోడీ ఫ్రాన్స్‌ లో పర్యటించారు. ఇందులో భాగంగా... బాస్టిల్ డే సైనిక కవాతుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ తో మోడీ అధికారిక చర్చలు జరిపారు.

దక్షిణాఫ్రికా:

ఈ ఏడాది ఆగస్టులో సౌతాఫ్రికాలో పర్యటించారు మొడీ. ఇందులో భాగంగా... జోహన్నెస్‌ బర్గ్‌ లో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం గ్రీస్‌ లో అధికారిక పర్యటన చేశారు. కాగా... 40 సంవత్సరాలలో ఇది భారత ప్రధాని తొలి పర్యటన కావడం గమనార్హం.

ఇండోనేషియా:

ఇక ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రధాని మోడీ ఇండోనేషియాలో పర్యటించారు. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి కొన్ని రోజుల ముందు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా... తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్నారు.

దుబాయ్‌:

ఈ ఏడాది నవంబర్ లో ప్రధాని మోడీ దుబాయ్‌ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా... సుమారు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న వరల్డ్‌ క్లైమేట్‌ యాక్షన్‌ సమ్మిట్‌ లో పాల్గొన్నారు.