Begin typing your search above and press return to search.

తాజ్ మహల్ ను కప్పిపెట్టారు... 1971లో మాక్ డ్రిల్స్ ఎలా జరిగాయి?

ఈ సమయంలో.. కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరుల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   6 May 2025 10:43 AM
1971 Mock Drills
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడి అనంతరం పాక్ పై భారత ఏ క్షణమైన "ఆపరేషన్" చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో.. కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరుల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో మే 7న (బుధవారం) దేశవ్యాప్తంగా 259 లొకేషన్ లలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. 1962, 1965 యుద్ధాల సమయంలో ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. అనంతరం 1971లో తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్ తో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి దీన్ని చివరిగా నిర్వహించారు.

వాస్తవానికి కార్గిల్ యుద్ధ సమయంలో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించినా.. అప్పుడు జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం చేశారు. అయితే.. ఈ సారి మాత్రం సుమారు 50 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు. ఈ సమయంలో 1971 మాక్ డ్రిల్స్ అనుభవాలను ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు.

అవును... 1971 నాటి మాక్ డ్రిల్స్ సంగతులను సీనియర్ జర్నలిస్ట్ మధురేంద్ర ప్రసాద్ సిన్హా పంచుకున్నారు. ఇందులో భాగంగా... యుద్ధానికి సరిగ్గా రెండు నుంచి నాలుగు రోజుల ముందు ఈ డ్రిల్స్ మొదలుపెట్టారని.. తూర్పు పాక్ లో లెఫ్టనెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకూ వీటిని కొనసాగించారని తెలిపారు.

ఆ సమయంలో రాత్రి 6:30 కల్లా అంతా ఇళ్లకు చేరుకునేవారని.. సైరన్ వినిపించగానే లైట్లన్నీ ఆపేసి, ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కునేవారమని తెలిపారు. ఆ సమయాల్లో గట్టిగా మాట్లడటం కూడా చేసేవారు కాదని తెలిపారు. ఇదే సమయంలో.. సైరన్ వినిపించగానే నేలపై పడుకొన్ని, చెవులు గట్టిగా మూసుకొనేవారని రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్కే శర్మ తెలిపారు.

ఇక.. 1971 యుద్ధ సమయంలో తాజ్ మహల్ ను కూడా కేమోఫాజ్ వస్త్రంతో కప్పిపెట్టారు. యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం దెబ్బ తీయడం కోసం సాంస్కృతిక చిహ్నమైన తాజ్ మహల్ పై పాకిస్థాన్ దాడి చేయొచ్చని నాడు భావించారు. దీంతో... దానిని శత్రువు కంటపడకుండా పరిసరాల్లో కలిసిపోయేలా ఓ ఆకుపచ్చని వస్త్రంతో కప్పిపెట్టారు!

ఈ తరహా జాగ్రత్తలే కుతుబ్ మినార్, ఎర్రకోట, జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు. అనంతరం వటి సమీపంలోని లైట్లు మొత్తన్ని ఆర్పేశారు.

ఇక బుధవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ.. దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. అందులో ప్రధాని నివాసం, త్రివిద దళాల హెడ్ క్వార్టర్స్ ఉండటంతో కేటగిరి 1లో ఢిల్లీ ప్రాంతాలు చేర్చారు. ఇదే సమయంలో తారాపూర్ అణుకేంద్రాన్ని కేటగిరీ 1 లో చేర్చారు.

ఇదే సమయంలో... రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం లను కేటగిరీ 2లో చేర్చారు. ఇలా దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. వీటిలో 100కు పైగా అతి సున్నితమైన ప్రదేశాలుగా గుర్తించారు!