ఏఐ వెలుగులో నిరుద్యోగ నీడలు.. ఒరాకిల్ నిర్ణయం దేనికి సంకేతం?
సాధారణంగా టెక్ ప్రాజెక్టులకు వెన్నుదన్నుగా నిలిచే అమెరికా బ్యాంకులు.. ఖరీదైన ఏఐ డేటా సెంటర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
By: A.N.Kumar | 3 Feb 2026 11:36 AM ISTసాంకేతిక ప్రపంచం ప్రస్తుతం ఒక విచిత్రమైన సంధి కాలంలో ఉంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టించబోయే అద్భుతాల గురించి ఊహల్లో తేలుతుంటే.. మరోవైపు అదే ఏఐ తెస్తున్న ఖర్చులు.. మారుతున్న ఆర్థిక సమీకరణలు వేల సంఖ్యలో ఉద్యోగాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ 2026 నాటికి సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించనుందనే వార్త ఈ చేదు నిజానికి అద్దం పడుతోంది.
ఖరీదైన 'ఏఐ' కల
ఏఐ రంగంలో అగ్రగామిగా నిలవాలంటే కేవలం సాఫ్ట్వేర్ ఉంటే సరిపోదు.. దానికి వెన్నుముక లాంటి డేటా సెంటర్లు, అత్యాధునిక చిప్లు, అపారమైన విద్యుత్ అవసరం. ఒరాకిల్ గత కొంతకాలంగా ఈ మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే ఊహించిన దానికంటే నిర్మాణం... చిప్ల ఖర్చులు పెరగడం, వడ్డీ రేట్లు భారమవ్వడం వల్ల కంపెనీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్యాంకుల వెనకడుగు.. ఆర్థిక ఒత్తిడి
సాధారణంగా టెక్ ప్రాజెక్టులకు వెన్నుదన్నుగా నిలిచే అమెరికా బ్యాంకులు.. ఖరీదైన ఏఐ డేటా సెంటర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. నిధుల లభ్యత తగ్గడంతో ఒరాకిల్ వంటి సంస్థలు తమ స్వయంశక్తిపై ఆధారపడక తప్పడం లేదు. ఫలితంగా $8 నుంచి $10 బిలియన్ల నగదు నిల్వలను సమకూర్చుకోవడం కోసం ఉద్యోగ కోతలు అనే కఠిన నిర్ణయానికి కంపెనీ సిద్ధమవుతోంది.
మానవ వనరుల కంటే మౌలిక వసతులకే ప్రాధాన్యమా?
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ ఆపరేషన్లలో కోతలు విధిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఇవి కంపెనీ వృద్ధికి కీలకమైన విభాగాలు. అయినప్పటికీ "తక్కువ మందితో ఎక్కువ సామర్థ్యం" అనే సూత్రాన్ని పాటిస్తూ టెక్నాలజీ ద్వారానే పనులను చక్కబెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇది కేవలం ఒరాకిల్ సమస్య మాత్రమే కాదు.. మొత్తం టెక్ రంగంలోని ధోరణిని సూచిస్తోంది.
పాఠం ఏమిటి?
ఏఐ యుగంలో ఉద్యోగం సాధించడం కంటే ఉన్న ఉద్యోగాన్ని నిలుపుకోవడం పెద్ద సవాలుగా మారింది. కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం వర్క్ఫోర్స్ను తగ్గించుకోవడం ఆందోళనకరం. ఏఐ అనేది ఉద్యోగాలను సృష్టించే ఇంజిన్ కావాలా లేక ఖర్చులను తగ్గించే కత్తెర కావాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.
ఒరాకిల్ అధికారికంగా ఈ వార్తను ధృవీకరిస్తే అది టెక్ రంగంలో మరో భారీ వలసకు దారితీయవచ్చు. ఏది ఏమైనా టెక్ నిపుణులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడమే ఈ అనిశ్చితికి ఏకైక పరిష్కారం.
