Begin typing your search above and press return to search.

నీళ్లు ఎక్కువ తాగింది.. మెదడు వాచింది.. మహిళ మృతి

అతి తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఒక మహిళ మృతి చెందింది

By:  Tupaki Desk   |   8 Aug 2023 6:17 AM GMT
నీళ్లు  ఎక్కువ  తాగింది.. మెదడు  వాచింది..  మహిళ మృతి
X

శరీరం సక్రమంగా పనిచేసేందుకు నీరు కీలక పాత్ర పోషిస్తుందనేది తెలిసిన విషయమే. అలా అని అవసరానికి మించి ఎక్కువ నీరు తాగకూడదు. అంటే... అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లన్నమాట. ఎక్కువగా తీసుకుంటే మంచి నీరు కూడా ప్రాణం తీసేస్తుందని తాజా ఉదాహరణ ఒకటి తెరపైకి వచ్చింది.

అవును... అతి తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఒక మహిళ మృతి చెందింది. ఆమె 20 నిమిషాల్లో సుమారు నాలుగు లీటర్ల నీరు తాగింది. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె మృతి చెందింది.

వివరాళ్లోకి వెళ్తే... యాష్లే సమ్మర్స్ అనే 35 ఏళ్ల మహిళకు అకస్మాత్తుగా నీరసం, నిస్సత్తువగా అనిపించింది. నోరు పిడచకట్టుకుపోతోంది. బాగా దాహం వేసినట్లు అనిపించింది. దీంతో 20 నిమిషాల్లో నాలుగు లీటర్ల నీరు తాగేసింది. ఫలితంగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

దీంతో ఆమె పరిస్థితి గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె మెదడు వాచిందని గుర్తించారు. అనంతరం చికిత్స ప్రారంభించారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. యాష్లే ప్రాణాలు కోల్పోయింది. అధికంగా నీరు తాగడం కారణంగానే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు.

ఆ సంగతి అలా ఉంటే... మెడికల్ న్యూస్ టుడే - 2013 అధ్యయనం ప్రకారం మూత్రపిండాలు రోజుకు 20 నుంచి 28 లీటర్ల నీటిని పంప్ చేయగలవు. అయితే అవి గంటకు 0.8 నుండి 1.0 లీటర్ల నీటిని మాత్రమే పంపగలవు. ఒక వ్యక్తి తక్కువ వ్యవధిలో 3-4 లీటర్ల నీటిని తాగితే హైపోనాట్రేమియా లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.

ఇదే సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి అధికమవుతుంది. మిగులు ద్రవాలను బయటకు పంపే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇదే సమయంలో విసుగు, తలనొప్పి, ఉబ్బరం వంటి లక్షణాలు తలెత్తుతాయి. మరికొన్ని సందర్భాల్లో గందరగోళం, కండరాల బలహీనత ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు.