Begin typing your search above and press return to search.

ఇక డా.రామ్ చ‌ర‌ణ్ అని పిలవాలి!

శనివారం నాడు మెగాభిమానుల సోష‌ల్ మీడియా ఖాతాల్లో చ‌ర‌ణ్ గౌరవ డాక్ట‌రేట్‌ని అందుకున్న ఫోటోల‌ను షేర్ చేసాయి.

By:  Tupaki Desk   |   13 April 2024 5:08 PM GMT
ఇక డా.రామ్ చ‌ర‌ణ్ అని పిలవాలి!
X

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్‌కి చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శనివారం నాడు మెగాభిమానుల సోష‌ల్ మీడియా ఖాతాల్లో చ‌ర‌ణ్ గౌరవ డాక్ట‌రేట్‌ని అందుకున్న ఫోటోల‌ను షేర్ చేసాయి. వేల్స్ వ‌ర్శిటీ కార్య‌క్ర‌మంలో చ‌ర‌ణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


అభిమానులు X ఖాతాలో షేర్ చేసిన‌ వీడియోలో రామ్ చరణ్ వేదికపై చీఫ్ గెస్ట్ గా క‌నిపించారు. విశ్వవిద్యాలయంలోని ఇతర గౌరవ సిబ్బంది నుండి గౌరవాన్ని అందుకుంటున్న వీడియో వైర‌ల్ అయింది. చ‌ర‌ణ్ ఎరుపురంగు గ్రాడ్యుయేషన్ గౌనులో కనిపించాడు. వేల్స్ విశ్వవిద్యాలయం అధికారిక X ఖాతాలోను చ‌ర‌ణ్ ఫోటోలు షేర్ అయ్యాయి. క్యాప్షన్‌లో ``రామ్ చరణ్ .. భారతీయ నటుడు, సినీ నిర్మాత, వ్యవస్థాపకుడు, వేల్స్ విశ్వవిద్యాలయం 14వ వార్షిక కాన్వకేషన్‌లో గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని అందుకున్నారు`` అని తెలిపారు.

గతంలో ఈ గుర్తింపు పొందినవారిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దర్శకుడు శంకర్ త‌దిత‌రులు ఉన్నారు. ఉపాసన కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రామ్ చ‌ర‌ణ్‌ తన గౌరవ డిగ్రీని అందుకోవడానికి వేదికపై ఎదురుచూస్తున్న కొన్ని ఫోటోల‌ను షేర్ చేసారు. ``నన్ను డాక్టర్ అని పిలవండి`` అంటూ గూఫీ క్యాప్షన్ ని ఇవ్వ‌గా అభిమానులు ఈ ఫోటోల‌ను వైర‌ల్ చేసారు.

రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేశారు. మగధీర, ఎవడు, ధృవ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను అందించాడు. SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది. రామ్ చ‌ర‌ణ్‌ తన పనితనానికి నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులను అందుకున్నారు.

వేల్స్ విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో విశిష్ట వ్యక్తులను యేటేటా గుర్తించి గౌర‌విస్తుంది. రామ్ చ‌ర‌ణ్‌ వినోద పరిశ్రమలో న‌టుడిగా, వ్యవస్థాపకుడిగా చేసిన కృషికి ఈ గౌరవాన్ని అందించారు. చంద్రయాన్, ఇస్రో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి వీరముత్తువేల్‌తో కలిసి రామ్ చ‌ర‌ణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. డాక్టర్ GSK వేలు, ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు.. పద్మశ్రీ గ్రహీత, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

రామ్ తదుపరి గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు నటించారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది.