Begin typing your search above and press return to search.

'విశ్వంభ‌ర‌'లో విలక్షణ నటుడు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభ‌ర‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 March 2024 10:27 AM GMT
విశ్వంభ‌ర‌లో విలక్షణ నటుడు?
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభ‌ర‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదో పంచభూతాల కాన్సెప్ట్ తో రూపొందుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. చిరు కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్, స్టార్ కాస్టింగ్ ఇందులో భాగం అవుతున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రావు రమేశ్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘విశ్వంభ‌ర‌’ సినిమాలో దేవకన్య పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీంతో పాటుగా ఈ చిత్రంలో ఓ మాంత్రికుడి పాత్ర కూడా ఉంటుందని టాక్. ఓ శాపం వ‌ల్ల నేల మీద కాలు పెట్ట‌లేక, ఆకాశంలోనే తిరుగుతూ ఉండేలా వెరైటీగా ఆ క్యారెక్టర్ ను వశిష్ఠ డిజైన్ చేశారట. అది క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర కావడంతో కాస్త పేరున్న నటుడిని తీసుకోవాలని మేకర్స్ భావించారట. పలువురు ప్రముఖ నటులను పరిశీలించిన తర్వాత, చివరకు రావు రమేశ్ ను ఫైనలైజ్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటి వరకూ ఎన్నో విలక్షణమైన రోల్స్ చేసిన రావు రమేష్.. గతంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర' మూవీలో మాంత్రికుడి పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన తండ్రి చిరంజీవి నటించే ‘విశ్వంభ‌ర‌’ చిత్రంలోనూ అలాంటి రోల్ చేయటానికి రెడీ అయ్యారట. కాకపోతే ఇది మోడర్న్ మాంత్రికుడి పాత్ర అని అంటున్నారు. స్టోరీలో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ఆయన క్యారెక్టర్ వల్లే వస్తుందని, ఇది రావు రమేష్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ సోషియో ఫాంటసీ కథలో సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారట. సిస్టర్ రోల్స్ కోసం ఓ మాదిరి క్రేజ్ ఉన్న హీరోయిన్లే ఎంపిక చేస్తున్నారట. ఇటీవల వార్తల్లో నిలిచిన ఈషా చావ్లా, సురభి లను కూడా చెల్లెళ్ల పాత్రల కోసమో తీసుకున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే 'హిట్లర్' తర్వాత 5గురు చెల్లెళ్లతో చిరు నటించే చిత్రం 'విశ్వంభ‌ర‌' అవుతుంది. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

'విశ్వంభ‌ర‌' మూవీలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, యాక్షన్ సీన్స్ ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. దీని కోసం అన్నీ కలిపి 13 సెట్లు నిర్మించినట్లు తెలుస్తోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ లో జరిగిన షెడ్యూల్ లో, కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని కోకాపేట‌లో వేసిన ఓ సెట్ లో పెళ్లి పాట షూట్ చేస్తున్నారట. నిన్న ఆదివారం ఈషా చావ్లా, సురభి ఈ సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ షూటింగ్ మార్చి 18 - 19 తేదీల వరకూ జరగనుందని సమాచారం.

'విశ్వంభ‌ర‌' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.