Begin typing your search above and press return to search.

విక్రమార్కుడు 2 కథ సిద్ధమే కానీ..

రాజమౌళితో తప్ప వేరొక దర్శకుడితో అయితే విక్రమార్కుడు సీక్వెల్ చేయలేనని రవితేజ చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదని రాధామోహన్ క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   11 March 2024 4:11 AM GMT
విక్రమార్కుడు 2 కథ సిద్ధమే కానీ..
X

మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే విక్రమార్కుడు అని చెప్పాలి. ఈ సినిమా రవితేజని ఏకంగా స్టార్ గా మార్చేసింది. అంత వరకు మాస్ మహారాజ్ ఒక కామెడీ మాస్ హీరోగానే క్లిక్ అయ్యాడు. అయితే విక్రమార్కుడు తరువాత ఒక పవర్ఫుల్ సీరియస్ హీరోగా కూడా పాత్రలకు న్యాయం చేయగలడు అని నిరూపించాడు. ఈ సినిమా నుంచి రవితేజ స్టోరీ సెలక్షన్ కూడా పూర్తిగా మారిపోయింది.

ఇక అనంతరం కమర్షియల్ యాక్షన్ కామెడీ కథలకి పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తూ వచ్చాడు. వాటిలోనే ఎక్కువ విజయాలు కూడా అందుకున్నాడు. అలా కాకుండా కంప్లీట్ సీరియస్ నోట్ లో చేసిన మూవీస్ మాత్రం డిజాస్టర్ అయ్యాయి. విక్రమార్కుడు మూవీ రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు అయ్యింది. ఈ మూవీని ఇతర భాషలలో కూడా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

ఇన్నేళ్ల తర్వాత విక్రమార్కుడు సీక్వెల్ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ విక్రమార్కుడు 2 మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని తాజాగా భీమా మూవీ ప్రమోషన్స్ లో ఆయనే తెలియజేశారు. విక్రమార్కుడు సీక్వెల్ రైట్స్ ని నేను తీసుకున్నానని తెలిపారు. దీనికి విజయేంద్రప్రసాద్ స్టోరీ కూడా సిద్ధం చేశారని అన్నారు.

అయితే రవితేజ మాత్రం విక్రమార్కుడు సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపించలేదని చెప్పారు. రాజమౌళితో తప్ప వేరొక దర్శకుడితో అయితే విక్రమార్కుడు సీక్వెల్ చేయలేనని రవితేజ చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదని రాధామోహన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విక్రమార్కుడు సీక్వెల్ పై ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. అయితే రాధామోహన్ ఈ సీక్వెల్ ని రవితేజతో కాకుండా వేరొక హీరోతో చేసే అవకాశం ఉందా అనేది చెప్పలేదు.

కెకె రాధామోహన్ అధినేత మూవీతో ప్రొడ్యూసర్ గా కెరియర్ స్టార్ట్ చేసి 11 సినిమాలు చేశారు. ఇతని ప్రొడక్షన్ లోనే సంపత్ నంది దర్శకుడిగా ఏమైంది ఈవేళ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. తరువాత బెంగాల్ టైగర్ అనే సినిమాని ఈ ప్రొడక్షన్ లోనే చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఓదేల రైల్వే స్టేషన్ అనే మూవీ కూడా చేశారు. గోపీచంద్ హీరోగా పంతం అనే సినిమాని కెకె రాధామోహన్ గతంలో నిర్మించారు. తాజాగ భీమా మూవీతో అతనికి హిట్ అందించారు.